
- కొత్త బాస్పై రెండు నెలల ముందు నుంచే ఐఏఎస్ వర్గాల్లో చర్చ
- రేసులో రామకృష్ణారావు, శశాంక్ గోయల్, జయేశ్ రంజన్, వికాస్రాజ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరు అనేదానిపై ఐఏఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎస్గా ఉన్న శాంతి కుమారి ఏప్రిల్ 7న పదవీ విరమణ చేయనున్నారు. అయితే.. ఆమె ప్లేస్లో ఎవరు వస్తారన్నది రెండు నెలల ముందు నుంచే అధికారుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నది. స్పెషల్ సీఎస్లుగా ఉన్న కొందరు ఐఏఎస్లు ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు టాక్.
సీనియర్ ఐఏఎస్లతోపాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన ఉన్నతాధికారులు ఈ పోస్ట్ కోసం పోటీ పడుతున్నారు. రేసులో జయేశ్ రంజన్, వికాస్ రాజ్, రామకృష్ణారావు, శశాంక్ గోయల్ తదితరులు ముందు వరుసలో ఉన్నారు. వాస్తవానికి శాంతికుమారి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సీఎస్గా నియమితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆమెను మారుస్తారనే ప్రచారం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మార్పు లేకుండా.. శాంతి కుమారినే చీఫ్ సెక్రటరీగా కంటిన్యూ చేస్తూ వస్తున్నది.
1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ ప్రస్తుతం ఐటీ, ఇండస్ట్రీస్ స్పెషల్ సీఎస్గా కొనసాగుతున్నారు. ఆయనకు ఇంకా రెండున్నరేండ్ల సర్వీస్ ఉంది. దావోస్ పర్యటనల్లో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఈసారి దావోస్ పర్యటనలో ఏకంగా రూ.1.79 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సీఎస్ పదవి కోసం జయేశ్ రంజన్ పోటీ పడుతున్నట్లు ఐఏఎస్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
జయేశ్ రంజన్ కంటే సీనియర్ 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు ఈ ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఫైనాన్స్ స్పెషల్ సీఎస్గా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉండగా, ప్రభుత్వానికి అవసరమైన నిధులను సమకూర్చడంలో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు పేరుంది. బీఆర్ఎస్ హయాంలో రామకృష్ణారావును సీఎస్ పదవి వరిస్తుందని భావించినప్పటికీ దక్కలేదు. రామకృష్ణారావు ఈ ఏడాది ఆగస్టులోనే రిటైర్ అవుతున్నారు. ఆయనను ఒకవేళ సీఎస్గా తీసుకుంటే పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తున్నది.
1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వికాస్ రాజ్ కూడా సీఎస్ పదవి రేసులో ఉన్నారు. ఆయనకు మూడేండ్లకు పైగా సర్వీస్ ఉంది. ప్రస్తుతం ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో సీఈవోగా పనిచేశారు. వరంగల్ ఎయిర్ పోర్ట్, రీజినల్ రింగ్ రోడ్ వంటి కీలక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నారు. ఇటీవల వారం రోజుల పాటు శాంతి కుమారి సెలవుపై వెళితే.. వికాస్ రాజ్కే తాత్కాలిక బాధ్యతలు ఇచ్చినట్లు తెలిసింది. అయితే.. ఆయనకు ఇంకా మూడున్నరేండ్ల సర్వీస్ ఉండటంతో తర్వాత అయినా సీఎస్ పోస్ట్ ఇవ్వొచ్చనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉందన్న చర్చ సాగుతున్నది.
సీనియర్ ఐఏఎస్ శశాంక్ గోయల్ కూడా సీఎస్ పోస్ట్ రేసులో ఉన్నట్లు తెలిసింది. గోయల్ 1990 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ఆఫీసర్. ఇప్పుడున్న ఐఏఎస్ల్లో అందరి కంటే ఆయనే సీనియర్. ప్రస్తుతం ఎంసీహెచ్ఆర్డీ డీజీగా పనిచేస్తున్నారు. ఆయనకు రిటైర్ అవ్వడానికి ఇంకా ఏడాదిన్నర టైం ఉన్నది. శశాంక్ గోయల్ పేరు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.