
- శాంపిల్స్ సేకరణ, లబ్ధిదారుల సంఖ్యలో 12 శాతం మెరుగుదల
- కొత్తగా 174 స్పోక్స్ సెంటర్లు, 25 వాహనాల ఏర్పాటు
- 92 శాతం మందికి 24 గంటల్లోపే ఎస్ఎమ్ఎస్ ద్వారా టెస్టుల రిపోర్ట్స్
హైదరాబాద్, వెలుగు: ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన ‘తెలంగాణ డయాగ్నోస్టిక్స్’ కు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తున్నది. ఇందులో పరీక్షలు చేయించుకునే రోగుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూ వస్తున్నది. డిమాండ్ కు తగ్గట్టుగా ప్రభుత్వం టీ డయాగ్నోస్టిక్స్హబ్ ల సంఖ్య పెంచడంతోపాటు స్పోక్స్(స్మాల్ హెల్త్ సెంటర్లు) ఏర్పాటు, సేకరించిన శాంపిల్స్ ను స్పోక్స్ ల నుంచి హబ్ లకు తరలించేందుకు వాహనాల సంఖ్యను పెంచుతూ వస్తున్నది.
నిరుడితో పోలిస్తే ఈ ఏడాది నెలసరి సగటు లబ్ధిదారుల సంఖ్య, శాంపిల్స్ సేకరణ గణనీయంగా పెరిగింది. దీంతోపాటు శాంపిల్స్ సేకరణ, టెస్టుల సంఖ్య, రిజల్ట్స్, రేడియాలజీ సర్వీసుల్లో పురోగతి సాధిస్తున్నది. ఈ నేపథ్యంలో టీ డయాగ్నోస్టిక్స్హబ్ లను ఏజెన్సీల ప్రాంతాల్లో సైతం విస్తరించింది. ఊట్నూరులో టీ డయాగ్నోస్టిక్ హబ్ ను ఏర్పాటు చేసింది. అలాగే, నారాయణపేట, మేడ్చల్ మల్కాజ్గిరిలో రెండు కొత్త డయాగ్నోస్టిక్ హబ్లు, భద్రాచలం, ఏటూరు నాగారం, మన్ననూర్లో3 ట్రైబల్ హబ్లు త్వరలో స్టార్ట్ అవబోతున్నాయి.
అలాగే, రాజన్న సిరిసిల్ల, ఖమ్మంలోని గవర్నెమెంట్ జనరల్ హాస్పిటల్స్లోని ల్యాబ్లను ఒకటిగా చేసే పైలెట్ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రారంభమైంది. భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో సిటీ స్కాన్ రిపోర్ట్ల కోసం టెలి రేడియాలజీ అనే కొత్త సర్వీస్ స్టార్ట్ చేశారు. దీంతో డాక్టర్లు ఆన్లైన్లోనే రిపోర్ట్లు చూసి.. రోగులకు సలహా ఇవ్వగలుగుతున్నారు. అలాగే, భద్రాచలం, ఏటూరు నాగారం, మన్ననూర్ లాంటి ఏజెన్సీ ఏరియాల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది.
టీ డయాగ్నోస్టిక్ హబ్స్లో టెస్టుల రిపోర్టులు రావడానికి పట్టే సమయాన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. 2023–24లో రిపోర్ట్ రావడానికి సగటున 11 గంటలు పట్టేది. 2024–25లో అది 10 గంటలకు తగ్గింది. అంటే 9 శాతం స్పీడ్ పెరిగింది. 24 గంటల్లో రిపోర్ట్ తీసుకునే వాళ్ల శాతం 87 శాతం నుంచి 92 శాతానికి పెరిగింది. అంటే 24 గంటల్లోనే ఎస్ఎమ్ఎస్ ద్వారా రిపోర్టులు అందుకునేవారి సంఖ్య 6 శాతం మెరుగుపడింది. అలాగే, శాంపిల్స్ సరిగ్గా తీసుకోని కారణంగా కొన్ని రిజెక్ట్ అయ్యేవి. అలాంటివి 0.5 శాతం నుంచి 0.3 శాతానికి తగ్గాయి. అంటే 0.2 శాతం క్వాలిటీ మెరుగుపడింది.
స్పోక్స్ సంఖ్యలోనూ పెరుగుదల
మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు స్పోక్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వాటి అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఏడాది కాలంలో 174 స్పోక్స్ ను ఏర్పాటు చేసింది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా 1,372 స్పోక్స్ ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 1,546 కు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ల నుంచి శాంపిల్స్ ను వాహనాల ద్వారా టీ డయాగ్నోస్టిక్ హబ్ లకు తరలిస్తారు. శాంపిల్స్ ను తరలించే వాహనాల సంఖ్యను కూడా పెంచారు. గతంలో 132 వాహనాలు ఉంటే, ప్రస్తుతం ఆ సంఖ్య 157కు పెరిగింది. అంటే కొత్తగా 25 వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. 2023–24లో 31 డయాగ్నోస్టిక్స్హబ్లు ఉంటే, 2024–25లో ఒక కొత్త ట్రైబల్ హబ్ (ఊట్నూర్లో) ఏర్పాటు చేశారు. దీంతో ల్యాబ్ల సంఖ్య 32 కు పెరిగింది.
రేడియాలజీ సర్వీసుల్లో కూడా..
ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ లాంటి రేడియాలజీ టెస్ట్లు కూడా బాగా పెరిగాయి. ఎక్స్-రేలు 13,233 నుంచి 15,929కి (20శాతం పెరుగుదల), ఈసీజీలు 5,924 నుంచి 6,281 (6 శాతం పెరుగుదల), అల్ట్రాసౌండ్ (యూఎస్జీ) 9,852 నుంచి 12,430 (26 శాతం పెరుగుదల), టీఐఎఫ్ఎఫ్ఏ స్కాన్లు (గర్భిణులకు) 921 నుంచి 1,159 (26 శాతం పెరుగుదల), మామోగ్రామ్లు (బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్) 579 నుంచి 677కి (17శాతం పెరుగుదల) పెరిగాయి. దీనివల్ల ఎక్కువ మంది మహిళలు, గర్భిణులు లబ్ధి పొందుతున్నారు.