
- చెన్నూర్లో కాంగ్రెస్ జోష్
- 40 వేల ఉద్యోగాల హామీతో వివేక్కు జై కొడుతున్న యూత్
- గులాబీ పార్టీకి గుడ్బై చెప్తున్న లీడర్లు, ప్రజాప్రతినిధులు
- రైతులు, సింగరేణి కార్మికుల మద్దతు వివేక్కే..
- బాల్క సుమన్, అనుచరుల ఆగడాలతో విసుగెత్తిన జనం
- ప్రచారానికి పోవాలంటేనే భయపడుతున్న బీఆర్ఎస్ లీడర్లు
- పోల్ మేనేజ్మెంట్పైనే దింపుడు కల్లం ఆశలు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ (ఎస్సీ) సెగ్మెంట్ రాష్ర్టంలోనే హాట్సీట్గా మారింది. కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి, బీఆర్ఎస్ నుంచి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఈ ఎన్నికల్లో పోటీపడుతున్నారు. వాస్తవానికి వివేక్ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. కానీ, నియోజకవర్గంలోని అనుచరులు, అభిమానుల ఒత్తిడి మేరకు అసెంబ్లీ బరిలో నిలిచారు. వివేక్ రాకతో ఒక్కసారిగా నియోజకవర్గంలో పొలిటికల్ సీన్ మారిపోయింది. మొన్నటిదాకా చెన్నూర్లో తనకు ఎదురే లేదనుకున్న సుమన్ బలమైన ప్రత్యర్థి రావడంతో డిఫెన్స్లో పడ్డారు. రోజురోజుకు బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ అవుతూ...కాంగ్రెస్ గ్రాఫ్పెరుగుతుండడంతో బుగులు పడుతున్నారు.
ప్రచారంలో దూసుకెళ్తూ...
లేట్అయినా లేటెస్ట్గా వచ్చిన వివేక్ వెంకటస్వామి 15 రోజులుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నెల 6న జైపూర్ మండలం ఇందారం నుంచి చెన్నూర్ వరకు 25 కిలోమీటర్లు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించారు. రోజూ పొద్దుట ఆరు గంటలకు మార్నింగ్వాక్తో స్టార్ట్ చేసి రాత్రి పదింటి దాకా విరామం లేకుండా పల్లెల్లో పర్యటిస్తున్నారు.
ఏ ఊరికి వెళ్లినా ఆయనకు జనాలు డప్పు చప్పుళ్లు, మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర, బిడ్డ పెండ్లి రోజు అరెస్టు, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భం గురించి ప్రజలకు గుర్తు చేస్తున్నారు. వివేక్ సతీమణి గడ్డం సరోజ గ్రామాల్లో ప్రచారం చేస్తూ తన ప్రసంగంతో ఆకట్టుకుంటున్నారు. కొడుకు వంశీకృష్ణ యువకులతో భేటీ అవుతూ తండ్రికి మద్దతు కూడగడుతున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ప్రజా సమస్యలే ఎజెండాగా...
వివేక్ వెంకటస్వామికి చెన్నూర్ నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉండడంతో ప్రచారంలో ప్రజా సమస్యలనే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పథకాల్లో లక్ష కోట్లకు పైగా దోచుకున్నాడని, బాల్క సుమన్ల్యాండ్, సాండ్ దందాలతో రూ.వెయ్యి కోట్లకు పైగా సంపాదించాడంటూ.. 30 పర్సెంట్ కమీషన్ గవర్నమెంట్నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
డబుల్ బెడ్రూంలు, దళితులకు మూడెకరాల భూమి, దళితబంధులో కమీషన్లు, నిరుద్యోగ భృతి, రేషన్ కార్డులు, 57 ఏండ్లకే పింఛన్లు, మిషన్ భగీరథ స్కీం, ఇతర వైఫల్యాలను వివరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్వాటర్ ముంపు రైతుల కోసం తాను పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, తనను గెలిపిస్తే న్యాయం జరిగేలా చూస్తానని బాధితులకు వివేక్భరోసా ఇస్తున్నారు.
తన తండ్రి వెంకటస్వామి కృషితోనే జైపూర్ఎస్టీపీపీ ఏర్పాటైందని, తాను ఎంపీగా ఉన్నప్పుడు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కృషి చేశానని, మందమర్రి, బెల్లంపల్లి వాటర్ స్కీమ్, రూ.400 కోట్లతో రోడ్లు, తాగునీటి పథకాలు తీసుకొచ్చానని చెబుతున్నారు. తన అన్న వినోద్ మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన బ్రిడ్జిలను కూడా సుమన్ తన ఖాతాలో వేసుకున్నాడని వివరిస్తున్నారు. సుమన్ ఒంటెత్తు పోకడలు, అనుచరుల ఆగడాలు, ప్రశ్నించిన వారిపై పెట్టిన కేసులు, చేసిన దాడుల గురించి నిలదీస్తున్నారు. నాడు వంద కేసులున్నాయన్న సుమన్కు రూ.వెయ్యి కోట్లు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నిస్తున్నారు.
సింగరేణి కార్మికులు, యూత్పై ఫోకస్...
సింగరేణి అప్పులపాలై బీఐఎఫ్ఆర్ పరిధిలోకి వెళ్లినప్పుడు కాకా వెంకటస్వామి ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్ల లోన్ ఇప్పించి సంస్థను కాపాడారు. సింగరేణి
కార్మికులకు పెన్షన్ విధానం తీసుకొచ్చారు. సింగరేణిలో తెలంగాణ వచ్చే నాటికి 60 వేలకు పైగా ఉద్యోగులుంటే కేసీఆర్ వచ్చిన తర్వాత 20 వేల మందిని ఇంటికి పంపడంతో ఆ సంఖ్య 40 వేలకు చేరింది. ఈ క్రమంలో కాంగ్రెస్ను గెలిపిస్తే కార్మికులకు ఇన్కమ్టాక్స్ రీయింబర్స్మెంట్, రిటైర్డ్ కార్మికులకు క్వార్టర్లు కేటాయింపు, కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వివేక్ హామీ ఇస్తున్నారు.
ట్రాన్స్కో, జెన్కోల నుంచి సింగరేణికి రావాల్సిన రూ.25వేల కోట్ల బకాయిల అంశాలను ప్రస్తావిస్తున్నారు. నియోజకవర్గంలో మూడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, చెన్నూర్లో మైనింగ్ ఇన్స్టిట్యూట్, అగ్రికల్చర్ మినీ యూనివర్సిటీ, కొత్త వంగడాల కోసం అగ్రి రీసెర్చ్సెంటర్, సిరామిక్ టైల్స్ఇండస్ర్టీ అభివృద్ధి ద్వారా 40 వేల ఉద్యోగాలు కల్పిస్తానంటూ వివేక్ యువతకు భరోసా ఇస్తున్నారు.
సుమన్కు నిరసనల భయం..
ఎమ్మెల్యే బాల్క సుమన్ వేల కోట్లతో చెన్నూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకుంటుండగా, ఇందులో చాలావరకు సెంట్రల్ ఫండ్స్, డీఎంఎఫ్టీ ఫండ్స్ కింద మంజూరైన పనులే ఉన్నాయి. ఎన్నికల ముందు హడావుడి కొబ్బరికాయలు కొట్టి వదిలేసినవి, అసంపూర్తిగా మిగిలిన పనులను సైతం ‘ప్రగతి నివేదిక’లో ప్రస్తావించారు.
చెన్నూర్లో డబుల్ బెడ్రూమ్లు, స్కిల్ డెవలప్మెంట్సెంటర్ పునాదులకే పరిమితం కాగా, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, డంపింగ్యార్డు, ట్యాంక్ బండ్లు, బస్ డిపో,100 బెడ్స్ హాస్పిటల్ అసంపూర్తిగా ఉన్నాయి. 50 బెడ్స్ హాస్పిటల్ కట్టినా అందులో సరైన డాక్టర్లు లేరు. వివేక్ ఎంపీగా ఉన్నప్పుడు మంజూరైన క్యాతన్పల్లి ఆర్వోబీ పనులు పూర్తి చేయకపోవడంతో ప్రజలు గుర్రుగా ఉన్నారు. మందమర్రి, చెన్నూర్లో రోడ్ వైడింగ్, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి అదే అభివృద్ధి అని చెప్పుకుంటున్నాడని ప్రజలు మండిపడుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ ముంపు రైతులకు నాలుగేండ్లుగా పరిహారం ఊసెత్తని సుమన్ఇటీవల గోదావరికి కరకట్టలు కడుతామని, నష్టపరిహారం ఇస్తామని చెప్పడంపై రైతులు మండిపడుతున్నారు. సింగరేణి ఓసీపీల్లో, జైపూర్ ఎస్టీపీపీలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం వసూళ్లు, ఇసుక అక్రమ రవాణా ఆరోపణలపై సుమన్ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. ఉన్న లీడర్లను, కేడర్ను కాపాడుకునేందుకు విచ్చలవిడిగా పైసలు వెదజల్లుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
రామకృష్ణాపూర్లో కేటీఆర్మీటింగ్, మందమర్రిలో కేసీఆర్ మీటింగ్ నిర్వహించినా మైలేజీ రాలేదు. ఈనెల 27న చెన్నూర్లో కేటీఆర్ మీటింగ్, 28న బైక్ ర్యాలీ ఏర్పాటు చేసినా బూస్టింగ్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే మందమర్రి మండలంలో పలుచోట్ల నిరసనలు ఎదురుకావడంతో గ్రామాల్లోకి ప్రచారానికి పోవడానికి జంకుతున్నారు. చివరి రెండు రోజులు పోల్ మేనేజ్మెంట్పైనే బాల్క సుమన్ ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
కారు దిగిన క్యాడర్..
నియోజకవర్గంతో కాకా వెంకటస్వామి ఫ్యామిలీకి 60 ఏండ్ల అనుబంధం ఉంది. వివేక్కు పదవులు లేకపోయినా తొమ్మిదేండ్లుగా ప్రజల మధ్యలోనే ఉన్నారు. తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలపై పోరాటాలు చేయడమే గాకుండా విశాక ట్రస్ట్, కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. దీంతో ఆయనకు కాంగ్రెస్ టికెట్ ప్రకటించగానే వివిధ పార్టీల్లో ఉన్న అనుచరులు, అభిమానులు హస్తం గూటికి చేరుకున్నారు.
సుమన్ అనుచరుల ఆగడాలను మౌనంగా భరిస్తున్న వారికి వివేక్ కొండంత అండలా కనిపించారు. బీఆర్ఎస్లోని అససమ్మతివాదులు, అసంతృప్తి నేతలు కాంగ్రెస్కండువా కప్పుకున్నారు. చెన్నూర్, కోటపల్లి, జైపూర్, భీమారం, మందమర్రి మండలాలకు చెందిన వందలాది లీడర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు కారు దిగారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా పుంజుకుంది.