
- రోడ్డు గురించి పట్టించుకున్న నాథుడే లేడు
- వచ్చే ఎన్నికలను బహిష్కరిస్తాం
- నిర్మల్జిల్లా అంబుగాం గ్రామస్తుల ప్రతిజ్ఞ
- గ్రామంలో నిరసన ర్యాలీ
కుంటాల, వెలుగు : పదేండ్ల నుంచి నాయకుల హామీలు నమ్మి మోసపోతున్నామని, తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని వేడుకున్నా పట్టించుకోలేదని, ఫలితంగా ఊరికి108 వాహనం కూడా రావడం లేదని నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని అంబుగాం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉర్లోకి రాజకీయ పార్టీలు, నాయకులను రానివ్వమని శుక్రవారం ప్రతిజ్ఞ చేసి భారీ నిరసన ర్యాలీ తీశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు సౌకర్యం లేక ప్రాణాలు పోతున్నాయని, స్టూడెంట్లు బడికి దూరమయ్యారని ఎమ్మెల్యే విఠల్రెడ్డికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. రాజకీయ పార్టీలను నమ్మే పరిస్థితి, ఓపిక తమకు లేదన్నారు. వచ్చే ఎన్నికలను బహిష్కరించి తమ గోడు ఉన్నతాధికారులకు తెలిసేలా చేస్తామని చెప్పారు. తమ నిర్ణయంలో మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ బాపూరావ్, ఎంపీటీసీ రాథోడ్ సునిత, యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.