
మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్లో వర్గ విభేదాలు భగ్గుమన్నారు. డాక్టర్ మురళీ నాయక్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మాధవ రెడ్డి వర్గాలు బాహాబాహీకి దిగారు. మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు సమావేశంలో ఈ వర్గ విభేదాలు వెలుగు చూశాయి.
మహబూబాబాద్ పట్టణంలో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మాధవ రెడ్డి, వెన్నం శ్రీ కాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అయితే డాక్టర్ మురళీ నాయక్ ను స్టేజ్ పైకి పిలవాలంటూ ఆయన అనుచరులు ఆందోళన చేశారు.
Also Read :- వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ నుంచే పోటీ చేస్తా: బండి సంజయ్
మురళీ నాయక్ ను ఎందుకు స్టేజ్ పైకి ఆహ్వానించలేదంటూ ఆయన వర్గీయులు స్టేజ్ పైకి దూసుకొచ్చారు. మురళీనాయక్ అనుచరులతో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మాధవ రెడ్డి అనుచరులు గొడవకు దిగారు. మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ సమక్షంలోనే ఈ వర్గపోరు భగ్గుమన్నది. మాధవరెడ్డికి వ్యతిరేకంగా మురళీ నాయక్ అనుచరులు నినాదాలు చేశారు. దీంతో సమావేశం మధ్యలో నుంచి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మాధవ రెడ్డి వెళ్లిపోయారు.