
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అక్రమంగా తరలిస్తున్న నగదు, బంగారం, వెండిని సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల కోట్లలో డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో సిసిసి నస్పూర్ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు రూ. 5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
సిసిసి నస్పూర్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కుశ్నపల్లి గంగారాం అనే వ్యక్తి దగ్గర రూ.5 లక్షల నగదు లభించింది. అయితే ఈ డబ్బులకు సరైన పత్రాలు చూపించలేకపోయాడు గంగారం. దీంతో ఆ డబ్బును పోలీసులు సీజ్ చేశారు. తదుపరి విచారణ కోసం FST టీంకి అప్పగించారు.
ALSO READ: ఎల్ఐసీకి రూ. 38 వేల కోట్ల జరిమానా
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ క్రమంలో తాయిలాలు, నగదు పంపిణీతోపాటు ఇతర ప్రలోభాలపై ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. ముఖ్యంగా నగదు, బంగారం, ఇతర వస్తువుల తరలింపుపైనా ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే పోలీసులు సీజ్ చేస్తారు. అయితే రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే..
- రూ.50 వేల కంటే ఎక్కువ నగదును వెంటతీసుకెళ్తే.. ఆ డబ్బును డ్రా చేసిన రసీదు లేదా సంక్షిప్త సందేశం ఉండాలి
- ఆసుపత్రుల్లో బిల్లులు చెల్లించేందుకు డబ్బు తీసుకెళ్తే.. పేషెంట్ వివరాలు, సంబంధిత రిపోర్టులు చూపించాలి.
- కార్మికులు, కూలీలు, ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు నగదు తీసుకెళ్తే డ్రా చేసిన ఖాతా వివరాలు, సిబ్బంది జాబితా ఉండాలి.
- బంగారు ఆభరణాలు, వస్తువులు తీసుకెళ్తుంటే వాటి ఆర్డర్ పత్రాలు, రసీదులు చూపించాలి.
- భూ లావాదేవీల విషయంలో నగదు తీసుకెళ్తే అందుకు సంబంధింత దస్తావేజులు, మీ సేవా కేంద్రాల్లో నమోదు చేసుకున్న స్లాట్ పత్రాలు ఉండాలి.