
- ఈవెంట్ పనులను స్పీడప్ చేసిన రాష్ట్ర సర్కార్
- ప్రపంచానికి తెలంగాణ వైభవం చాటేలా ఏర్పాట్లు
- కంటెస్టెంట్లను రాష్ట్రంలోని టూరిస్ట్ ప్లేస్లకు తీసుకెళ్తాం: మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు : 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్కు తెలంగాణ సిద్ధమవుతున్నది. మే 7 నుంచి మే 31 వరకు జరిగే ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం తెలంగాణ సంస్కృతి, చారిత్రక వారసత్వం, ఆధునికతను ప్రపంచ వేదికపై ఆవిష్కరించనుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, శిల్పకళా వేదిక, హైటెక్స్ వంటి మూడు ప్రముఖ వేదికల్లో ఈ ఫెస్టివల్ జరుగనుంది. ఈ అరుదైన అవకాశం రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం మ్యాప్లో నిలపనుంది.
ఈ మేరకు మిస్వరల్డ్ వేడుక నిర్వహణకు సంబంధించిన పోస్టర్ను టూరిజం శాఖ రిలీజ్చేసింది. ఈ ఫెస్టివల్ రాష్ట్ర పర్యాటక రంగానికి గ్లోబల్ గుర్తింపు తెచ్చి, భారత సంస్కృతిని ప్రపంచానికి చాటనుంది.
గ్రాండ్ ఫినాలే
ఫినాలేలో ఒక గంట రెడ్ కార్పెట్ స్పెషల్, మూడు గంటల ప్రత్యక్ష ప్రసారం, కరోనేషన్ గాలా ఉంటాయి. దీనికి బాలీవుడ్, స్పోర్ట్స్, వ్యాపార రంగాల ప్రముఖులు హాజరవుతారు. 6 కాంటినెంటల్ విజేతలు, కొత్త మిస్ వరల్డ్ ప్రకటన ఈ సమయంలోనే జరుగుతుంది. 140 దేశాల్లో ఈ కార్యక్రమం లైవ్ ప్రసారం కానుంది. స్పాన్సర్లకు ప్రత్యేక అవార్డులు అందజేస్తారు. టైటిల్ స్పాన్సర్షిప్ రూ.25 కోట్లు కాగా.. లోగో ప్లేస్మెంట్, టీవీ, డిజిటల్ మీడియాలో గ్లోబల్ రీచ్, వీఐపీ టికెట్లు, బ్రాండ్ ఎక్స్పీరియన్స్ జోన్లు ఉండనున్నాయి. ప్రెజెంటింగ్ స్పాన్సర్షిప్ రూ.15 కోట్లు, వేదికల్లో లోగో, రెడ్ కార్పెట్ విజిబిలిటీ, సోషల్ మీడియా రీచ్, ప్రత్యక్ష ప్రసారంలో బ్రాండ్ మెన్షన్ ఉంటాయి.
తెలంగాణ గొప్పతనం చూపాలి: మంత్రి జూపల్లి
తెలంగాణ సంస్కృతి, చారిత్రక వైభవం చాటి చెప్పేలా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించాలని అధికారులను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. గురువారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చే కంటెస్టెంట్లను తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, ఆధ్మాత్మిక క్షేత్రాలు, చారిత్రక కట్టడాలకు తీసుకెళ్లాలని అధికారులకు చెప్పారు.