
- పంచాయతీరాజ్శాఖ ఫైల్కు ఆర్థిక శాఖ క్లియరెన్స్
- మే నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు
- 92,175 వేల మంది ఉద్యోగులు, కార్మికులకు ప్రయోజనం
- ప్రతినెలా జీతాల కోసం రూ.115 కోట్లు కేటాయింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పనిచేసే చిరు ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఇక నెలనెలా వేతనాలు అందనున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ ఫైల్ కు మంగళవారం ఆర్థికశాఖ క్లియరెన్స్ ఇచ్చింది. మే నెల నుంచి ఇక ఠంచన్గా ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించినట్టుగానే సకాలంలో వేతనాలు నేరుగా వారి బ్యాంకు అకౌంట్లో పడనున్నాయి. గ్రీన్ చానెల్ ద్వారా వేతనాలు అందజేయనుండడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 92,175 ఉద్యోగులు, కార్మికులకు ప్రయోజనం కలగనున్నది. వారికి ప్రతినెలా దాదాపు రూ.115 కోట్లు వేతనాల రూపంలో ప్రభుత్వం చెల్లిస్తున్నది. అయితే, గతంలో ఎస్ఎఫ్సీ నిధుల్లోంచి జీతాలు చెల్లించేది. లోకల్ బాడీ ఎన్నికలు లేకపోవడంతో ఇటు ఆర్థిక సంఘం, అటు స్టేట్ ఫైనాన్స్ నిధులు కొంత కాలంగా ఆగిపోయాయి. దీంతో గ్రామీణ ఉద్యోగులు, కార్మికులకు జీతాలు సకాలంలో అందడం లేదు. దీంతో ఉద్యోగులకు నెలనెలా వేతనాలు అందించడం కోసం ప్రత్యేకంగా స్టేట్ ఫైనాన్స్ నిధులను కేటాయించేందుకు ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్తీసుకున్నట్టు తెలిసింది.
ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు..
92,175 మంది గ్రామీణ ప్రాంత ఉద్యోగులు, సిబ్బందికి ప్రతినెలా రూ.115 కోట్ల 35 లక్షల 81 వేల 533 చెల్లిస్తున్నారు. అయితే, వీరికి జీతాలు నెలనెలా చెల్లించేందుకు ప్రత్యేక వ్యవస్థను తయారు చేయాలని పీఆర్, ఆర్డీ సెక్రటరీ లోకేశ్ కుమార్, డైరెక్టర్ సృజనను ఆదేశించారు. దీంతో ప్రత్యేక పోర్టల్ను రూపొందించారు. అందరికీ ఒకేసారి జీతాలు పడేలా ఏర్పాటు చేశారు. మంత్రి సీతక్క చొరవతో ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ప్రతినెలా పీఆర్, ఆర్డీ అధికారులు ప్రతినెలా 25వ తేదీన ఆన్ లైన్ లో హాజరు తెప్పించుకుంటారు. 26వ తేదీన బిల్స్ జనరేట్ చేస్తారు. ఏకకాలంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించనున్నారు. ఈ విధానంతో ఏండ్లుగా ఇబ్బంది పడుతున్న వేలాది మంది గ్రామీణ ఉద్యోగుల కష్టాలు తీరనున్నాయి. ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 92,175 ఉద్యోగులు, కార్మికులకు ప్రయోజనం చేకూరనున్నది.
రాష్ట్రంలోని పంచాయతీల్లో మల్టీ పర్పస్ వర్కర్లు 52,473 మంది, జీపీ కంప్యూటర్ ఆపరేటర్లు 1,301, మండల కంప్యూటర్ ఆపరేటర్లు 278, జిల్లా ప్రజా పరిషత్పార్ట్ టైం వర్కర్లు 170, జిల్లా ప్రజా పరిషత్ ఫుల్ టైం వర్కర్లు 1, మండల ప్రజా పరిషత్ పార్ట్ టైం వర్కర్లు 1,330, ఎంపీపీ ఫుల్ టైం వర్కర్లు 19, కాంట్రాక్ట్ పంచాయతీ సెక్రటరీలు 9, ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలు 792, డీపీఎంలు 31, జూనియర్ పంచాయతీ సెక్రటరీలు 817, సెర్ప్ 22,011, సొసైటీ ఫర్ రూరల్ డెవలప్ మెంట్ సర్వీసెస్ 12,586, డీడీయూ జీకేవై 107, ఎస్ ఎస్ బీఎం 70, ఎస్ ఎస్ ఏ ఏ టీలు 180 మంది ఉన్నారు. వీరందరూ ఇక నుంచి నెలనెలా వేతనాలు