మహిళలకు ఆర్థిక అండ

మహిళలకు ఆర్థిక అండ
  •     మహిళ శక్తి ద్వారా ఉపాధి కల్పనపై ప్రభుత్వం ఫోకస్ ​
  •     2024–25 కు  కామారెడ్డి జిల్లాలో రూ. 186  కోట్ల 
  •     22,007 మంది మహిళలకు  లబ్ధి

కామారెడ్డి, వెలుగు:  మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం రాష్ట ప్రభుత్వం ‘మహిళ శక్తి’ పేరుతో భారీగా లోన్లు ఇవ్వనుంది. ఈ ఏడాది కామారెడ్డి జిల్లాలో 22,007 మంది డ్వాక్రా మహిళలకు రూ. 186 కోట్లను అందజేసి వారికి ఉపాధి కల్పించనుంది. విరివిగా లోన్లను ఇప్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు అండగా నిలవనుంది.  

కామారెడ్డి జిల్లాలో 17,098  డ్వాక్రా సంఘాల్లో 1 లక్షా 75 వేల మంది మెంబర్లుగా ఉన్నారు.  మహిళ సంఘాల మెంబర్లు ఇప్పటికే చాలా మంది బ్యాంక్​ లింకేజీ, స్ర్తీ నిధి ద్వారా లోన్లు పొందుతూ ఉపాధి పొందుతున్నారు.  స్టేట్ లో ​అధికారంలోకి  వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళ సంఘాల్ని మరింతగా బలోపేతం చేయటం, ఆర్థికంగా అండగా నిలిచేందుకు మహిళా శక్తి పేర  ఆయా జిల్లాలకు ఈ  ఆర్థిక ఏడాది 2024–-25 లో చేపట్టాల్సిన కార్యాచరణపై మార్గదర్శకాలు ఇచ్చింది. 

ఈ ఆర్థిక ఏడాదిలో  కామారెడ్డి జిల్లాలో  రూ. 186 కోట్లతో  22,007 మంది మెంబర్లకు 17,960 యూనిట్లు నెలకొల్పనున్నారు. మైక్రో ఎంటర్ ప్రైజేస్ లో భాగంగా కిరాణ, ఇతర చిన్న షాపులు,  వస్తువుల తయారీ, మీసేవా కేంద్రాల ఏర్పాటు, పాడిపరిశ్రమ,  డెయిరీల ఏర్పాటు,  మినీ పౌల్ట్రీ, బట్టలు కుట్టే యూనిట్లు, ఆహార వస్తువుల తయారీ,  మొబైల్​ యూనిట్లు, సోలార్​యూనిట్ల ఏర్పాటు వంటివి ఇందులో ముఖ్యమైనవి.  ఒక్కో యూనిట్​కు రూ. లక్ష 10 వేల నుంచి  రూ. 4 కోట్ల వరకు ఖర్చు కానుంది. బ్యాంక్​ , స్ర్తీ నిధి ద్వారా  జీరో వడ్డీతో లోన్లు ఇప్పిస్తారు. 
 
జిల్లాలో  యూనిట్ల ఏర్పాటు ఇలా

ఈ ఆర్థిక ఏడాదిలో జిల్లాలో 17,960 యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. ఇందులో  మైక్రో ఎంటర్​ ప్రైజేస్​ 10,413 యూనిట్లు ప్రతిపాదించారు.ఇందులో జిల్లాలోని అన్ని మండలాల్లో  725 గ్రామ సమాఖ్యల్లో   చిన్న షాపులకు సంబంధించి, ఒక్కో  యూనిట్​కు రూ. లక్ష 10 వేలు అందించనున్నారు. .   వీటిని ఇవ్వనున్నారు.  ఇందులో  ఇప్పటికే 3,153 యూనిట్లు  సెలక్టు చేశారు.  యూనిఫామ్స్​, ఇతర బట్టలు కుట్టేందుకు  131 స్ర్టిచ్చింగ్​ సెంటర్లు కూడా ప్రారంభించనున్నారు.  ఒక్కో  యూనిట్​కు రూ. 5.60 లక్షల ఇవ్వనున్నారు. 

ఒక్కోమీ సేవా సెంటర్  రూ.2.50 లక్షలు, మొత్తం14 మీ సేవా సెంటర్లకు రూ.35 లక్షలు అందించనున్నారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డికి చెందిన మహిళా సమాఖ్యకు రూ. 31.20 లక్షలతో  ఈవెంట్​ మెనేజ్​మెంట్​ యూనిట్​ను ఇప్పటికే అందజేశారు. ఇందులో  21 మంది మెంబర్లకు ఉపాధి కల్పిస్తారు.  గాంధారి, బాన్సువాడ, బిచ్​కుంద, ఎల్లారెడ్డి, కామారెడ్డిలో  మహిళ సమాఖ్యల ఆధ్వర్యంలో క్యాంటీన్ల ప్రారంభానికి  ఒక్కో యూనిట్​కు రూ. 20లక్షలు కాగా మొత్తం రూ. కోటి కేటాయించారు. దీని ద్వారా  40 మందికి ఉపాధి దొరుకుతుంది. 

ప్లాస్టిక్​ వెస్టేజ్​ మెనేజ్​మెంట్​ యూనిట్​ , మిల్క్​ పార్లర్​1,  మొబైల్​ అవుట్​ లేట్​ 1 ఉంది.   ఇండ్లలో పెరటి కోళ్ల పెంపకం యూనిట్లు  5  వేలు ఉండగా...  ఒక్కో  యూనిట్​ రూ. 90వేలు ఇవ్వనున్నారు. . దీనికి మొత్తం రూ.4.50 కోట్లు లోన్​ కేటాయించారు. రూ.64 లక్షతో 18  కోళ్ల పిల్లల ఉత్పత్తి సెంటర్లు, రూ. 3.20 కోట్లతో  160 పుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్లు,  రూ.2.50 కోట్లతో  10 కస్టమ్స్​ హైరింగ్​ యూనిట్లు ప్రకటించారు.  భిక్కనూరు మండలంలో రూ. 4 కోట్లతో  సోలార్​ యూనిట్​ ఏర్పాటు చేసి  203 మంది ఉపాధి కల్పించనున్నారు. దీనికోసం  ఇప్పటికే స్థలాన్ని గుర్తించారు. . ఇక్కడ ఉత్పత్తి అయ్యే కరెంట్​ను విద్యుత్తు సంస్థలకు అమ్ముతారు.   క్షేత్ర స్థాయిలో మీటింగ్​ ఏర్పాటు చేసి ఈ యూనిట్ల అన్నింటిపై  అవగాహనకల్పించనున్నారు.