
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- గతంలో ఈఆర్సీకి రఘు రాకుండా సర్క్యులర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ) టెక్నికల్ సభ్యునిగా కంచర్ల రఘు, ఫైనాన్స్ సభ్యునిగా చెరుకూరి శ్రీనివాస రావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇంధనశాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఐదేండ్లు లేదా 65 ఏండ్ల వయసు నిండేవరకు వీరు పదవిలో కొనసాగనున్నారు. ఈఆర్సీ చైర్మన్గా జస్టిస్ దేవరాజు నాగార్జున్ గతేడాది అక్టోబర్లో బాధ్యతలు స్వీకరించగా, తాజాగా ఇద్దరు సభ్యులను నియమించడంతో ఈఆర్సీలో ఖాళీలు భర్తీ అయినట్లైంది. ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసెస్(ఐఆర్ఏఎస్) అధికారి అయిన శ్రీనివాస రావు 2016 జులై 26 నుంచి ట్రాన్స్కో జేఎండీగా కొనసాగుతున్నారు. అంతకుముందు ఆయన సదరన్ డిస్కం ఫైనాన్స్ డైరెక్టర్గా పనిచేశారు. విద్యుత్ రంగంలో ఆయనకు దాదాపు 15 ఏండ్ల అనుభవం ఉంది.
తెలంగాణ ఉద్యమంలో రఘుది కీలకపాత్ర
ప్రస్తుతం ట్రాన్స్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న కంచర్ల రఘుకు విద్యుత్ రంగ నిపుణుడిగా గుర్తింపు ఉంది. 2017–22 మధ్య ట్రాన్స్కో చీఫ్ ఇంజనీర్గానూ ఆయన పనిచేశారు. ఏపీ స్థానికత అంశానికి తోడు అప్పటి బీఆర్ఎస్ సర్కారు వివిధ కారణాలతో రఘుకు డబుల్ డిమోషన్ ఇవ్వడంతో ప్రస్తుతం ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొజిషన్కు వచ్చారు. విద్యుత్శాఖలో సబ్ స్టేషన్లు, లైన్ల నిర్మాణం, నిర్వహణ, మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ రంగ విధానాలు, ఈఆర్సీ రెగ్యులేషన్స్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ ఉద్యోగులకు శిక్షణ వంటి అంశాల్లో రఘుకు ఎక్స్పర్ట్గా పేరుంది. విద్యుత్ రంగంపై ఆయన పలు పుస్తకాలనూ రాశారు.
విద్యుత్ జేఏసీ నేతగా రాష్ట్ర ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేశారు. తెలంగాణ వచ్చాక చత్తీస్గఢ్తో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని రఘు తీవ్రంగా తప్పుపట్టారు. ఒప్పందంలో ఉన్న లోపాల వల్ల కలిగిన నష్టాలను బయటపెట్టారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు, కొనుగోలు ఒప్పందాలు, కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణం వంటి అంశాలపై ఈఆర్సీ నిర్వహించే బహిరంగ విచారణల్లో రఘు పాల్గొంటూ ప్రజలకు భారంగా మారే ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలను వ్యతిరేకించారు.
దీంతో రఘును అడ్డుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఒత్తిడితో ఈఆర్సీ అప్పట్లో ఓ సర్క్యులర్ జారీ చేసింది. విద్యుత్ సంస్థల యాజమాన్యాల అనుమతితోనే విద్యుత్ ఉద్యోగులు ఈఆర్సీ బహిరంగ విచారణలకు హాజరు కావాలని కండిషన్ పెట్టింది. దీంతో నాటి నుంచి ఈఆర్సీకి వెళ్లకుండా రఘును అడ్డుకోగలిగారు. ఇప్పుడు అదే ఈఆర్సీ టెక్నికల్ సభ్యుడిగా రఘు నియమితులయ్యారు.