
- 2 మెగావాట్ల యూనిట్ ఏర్పాటుకు ప్లాన్
- ఒక్కో మెగా వాట్ కు రూ.3 కోట్ల వ్యయం
- ఏ గ్రేడ్ విలేజ్ ఆర్గనైజేషన్లకు అవకాశం
మెదక్, వెలుగు : ఖాళీగా ఉన్న ఎండోమెంట్, ఇరిగేషన్, అసైన్డ్ భూములను వినియోగంలోకి తేవడంతోపాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఇంధన, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఒక సోలార్ పవర్ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో అధికారులు ఎక్కడెక్కడ అనువైన భూములు ఉన్నాయో పరిశీలించారు. చాలా జిల్లాల్లో వందలాది ఎకరాల ఎండోమెంట్, ఇరిగేషన్ భూములు వృధాగా ఉన్నాయి. ఖాళీగా ఉండటంవల్ల ఖరీదైన ఈ భూములు కొన్ని చోట్ల అన్యాక్రాంతమవుతున్నాయి. ఒక్కో జిల్లాలో 150 ఎకరాల భూమి గుర్తించి ఐదేండ్లలో రాష్ట్రంలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంగల సోలార్ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది.
ఖాళీగా ఉన్న ఎండోమెంట్, ఇరిగేషన్, అసైన్డ్ భూములను గుర్తించి.. ప్లాంట్ఏర్పాటుకు గల అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రతి జిల్లాలో 2 మెగా వాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. మొదటివిడత 32 జిల్లాల్లో 64 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు నాలుగు ఎకరాల భూమి అవసరం కాగా ఒక్కో మెగా వాట్ ప్లాంట్ ఏర్పాటు కోసం రూ.3 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక్కో జిల్లాకు రూ.6 కోట్ల చొప్పున మొత్తం రూ.192 కోట్లు అవసరమని అంచనా వేశారు. గ్రామీణాభివృద్ధి, ఇంధన శాఖ ఎండోమెంట్, ఇరిగేషన్ భూముల్లో 8 ఎకరాల విస్తీర్ణంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది.
ఒక్కో మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు మొత్తం రూ.3 కోట్లు ఖర్చుకాగా ఇందులో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాటా కింద రూ.30 లక్షలు మహిళ సంఘాలు పెట్టుబడి పెట్టాల్సిఉంటుంది, మిగతా మొత్తం స్త్రీనిధి ద్వారా లోన్గా సమకూర్చనున్నారు. పొదుపు, రుణాల సద్వినియోగం, రికవరీల్లో ఆదర్శంగా ఉన్న విలేజీ ఆర్గనైజేషన్(వీఓ)లను ఏ గ్రేడ్ కింద గుర్తిస్తారు. ఏ గ్రేడ్ లో ఉన్న వీఓ లకు ఈ ప్లాంట్లను అప్పగిస్తారు. ప్లాంట్ ఏర్పాటుకు భూముల ఎంపిక తర్వాత నిధులమంజూరు. అనుమతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంపికయిన వీఓలకు సోలార్ ప్లాంట్ నిర్వహణ బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి నెల 8 లోగా సోలార్ ప్లాంట్ల ఏర్పాటు పూర్తిచేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు.