
- రామగుండం ఎంట్రన్స్లో 108 ఫీట్ల హనుమాన్ విగ్రహం ఏర్పాటు
- మేడిపల్లి ఓసీపీలో ట్రెక్కింగ్, పారా మోటర్ రైడింగ్
- ఎల్లంపల్లి ప్రాజెక్ట్లో బోటింగ్
గోదావరిఖని, వెలుగు : ఇండస్ట్రియల్ సిటీ రామగుండంలో టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. స్థానిక ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ చొరవతో రామగుండంలోని పలు ఏరియాలను పర్యాటకంగా తీర్చిదిద్దుతున్నారు. రామునిగుండాల డెవలప్మెంట్తోపాటు గుట్టపై రూ.15 కోట్లతో 108 ఫీట్ల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బసంత్నగర్ బుగ్గరామస్వామి టెంపుల్, జనగామలోని త్రిలింగేశ్వరాలయం అభివృద్ధి చేయనున్నారు. మూసేసిన జీడీకే 7 ఎల్ఇపీ గనిని తిరిగి తెరిపించి కోల్ టూరిజంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతోపాటు ఎల్లంపల్లి ప్రాజెక్ట్లో బోటింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
కొండగట్టును తలపించేలా...
పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి గోదావరిఖనికి వెళ్లే దారిలో 25 కిలోమీటర్ల దూరంలోని రామునిగుండాల గుట్టపై సిటీ ఎంట్రన్స్లో 108 ఫీట్ల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో పురాతన హనుమాన్ విగ్రహం బయటపడగా, అక్కడే తాత్కాలికంగా గుడి నిర్మించి పూజలు చేస్తున్నారు. గుట్టపై ఎత్తైన హనుమాన్ విగ్రహం నిర్మించి కొండగట్టును తలపించేలా నిత్యం భక్తులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసం చేసిన సమయంలో సీత, లక్ష్మణుడితో కలిసి ఈ ప్రాంతంలో కొన్ని రోజులు ఉండి నీటి కోసం 101 గుండాలను ఏర్పాటు చేసినట్టు ఇక్కడ ప్రచారం ఉంది. ఈ గుండాలను డెవలప్ చేసేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
టెంపుల్ కారిడార్
గోదావరిఖని పరిధిలోని జనగామలో కాకతీయుల కాలంలో నిర్మించిన త్రిలింగేశ్వరాలయం, బసంత్నగర్ వద్ద గల బుగ్గ రామస్వామి టెంపుల్, రామునిగుండాల గుట్టపై ఉన్న రాముని గుడి, వేంకటేశ్వర స్వామి టెంపుల్ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రామగుండం నుంచి వెల్గటూర్ మండలం కోటిలింగాలలోని శివాలయం వరకు ప్రత్యేక రోడ్డును నిర్మిస్తూ టెంపుల్ కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు.
బోటు షికారు, ట్రెక్కింగ్...
ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిత్యం నీటితో నిండి ఉంటోంది. దీంతో అక్కడికి పర్యాటకులను ఆకర్షించేలా బోటింగ్ కోసం ప్రతిపాదనలు పంపించారు. మూసివేసిన సింగరేణికి చెందిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్లో బొగ్గు కోసం తవ్విన కందకాల నుంచి పైకి ట్రెక్కింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికితోడు మేడిపల్లి ఓపెన్కాస్ట్ ప్రాంతంలోనే కొంత ప్రాంతాన్ని చదును చేసి పారామోటర్ రైడింగ్తో చుట్టుపక్కల అందాలను వీక్షించేలా ప్లాన్ చేశారు. ఇటీవల రామగుండం ప్రాంతానికి చెందిన ఒకరు ఓసీపీ ప్రాంతంలో పారామోటర్ రైడింగ్ ట్రయల్ రన్ చేసి సక్సెస్ అయ్యారు.
రామగుండం ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తాం..
రామగుండం ఇండస్ట్రియల్ ఏరియాలో టూరిజం అభివృద్ధిపై ఫోకస్ పెట్టాం. వివిధ పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు, ఆఫీసర్లు, వారి కుటుంబాలకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయాల అభివృద్ధికి ఫండ్స్ విడుదల చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లాం. ప్రజలందరి సహకారంతో రామునిగుండాల గుట్టపై 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం.
ఎంఎస్ రాజ్ఠాకూర్, రామగుండం ఎమ్మెల్యే