
- హైకోర్టులో మెమో దాఖలు చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైలులో, రైల్వే స్టేషన్లలో బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు లేవంటూ ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. బెట్టింగ్ యాప్ల ప్రకటనలకు సంబంధించిన ఒప్పందాలపై విచారణ జరిపించాలని కోరుతూ న్యాయవాది ఎన్.నాగూర్ బాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
ప్రైవేటు, ప్రభుత్వ ఒప్పందంలో భాగంగా ప్రకటనల జారీ తదితరాలన్నీ ఎల్ అండ్ టీకే చెందుతాయని ప్రభుత్వం మంగళవారం హైకోర్టులో మెమో దాఖలు చేసింది. బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు జారీ చేయరాదంటూ జీహెచ్ఎంసీ లేఖ నేపథ్యంలో మెట్రో సానుకూలంగా స్పందించి ప్రకటనలను తొలగించిందని తెలిపింది. ఈ పిటిషన్పై వేసవి సెలవుల తర్వాత విచారణ చేపడతామంటూ ధర్మాసనం వాయిదావేసింది.