
- గోదావరిపై హైలెవల్ బ్రిడ్జి రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- 2018లో రూ.125 కోట్లతో శాంక్షన్ చేసిన అప్పటి సీఎం కేసీఆర్
- అంచనా వ్యయం రూ.164 కోట్లకు పెంపు.. టెండర్, సాయిల్ టెస్ట్ పూర్తి
- ప్రత్యామ్నాయంగా ముల్కల్ల–ముర్మూర్ బ్రిడ్జికి రూ.450 కోట్లతో ప్రపోజల్స్
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల–-అంతర్గాంగోదావరి బ్రిడ్జిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్రాజ్ ఆర్డర్స్ జారీ చేశారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ గోదావరిపై హైలెవల్బ్రిడ్జి నిర్మించాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే 2018లో రూ.125 కోట్లతో బ్రిడ్జిని శాంక్షన్ చేస్తున్నట్టు అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2019 ఎలక్షన్స్ తర్వాత రెండోసారి బీఆర్ఎస్గవర్నమెంట్అధికారంలోకి వచ్చి కేసీఆర్ మళ్లీ సీఎం అయినప్పటికీ బ్రిడ్జికి మోక్షం కలగలేదు.
ప్రజలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో 2023 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మూడేండ్ల క్రితం పనులకు గ్రీన్సిగ్నల్ఇచ్చారు. అంచనా వ్యయాన్ని రూ.125 కోట్ల నుంచి రూ.164 కోట్లకు పెంచి టెండర్ కాల్చేయగా, వల్లభనేని కన్స్ట్రక్షన్స్ సంస్థ దక్కించుకుంది. వెంటనే సాయిల్ టెస్టింగ్ చేసి బ్రిడ్జి వర్క్ స్టార్ట్ చేయడానికి అంతా రెడీ చేశారు. అయితే ఇతర ఏరియాల్లో చేసిన ఇతర పనులకు సంబంధించిన కోట్ల రూపాయలను కాంట్రాక్టర్కు ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఈ బ్రిడ్జి పనులను నిలిపివేశారు.
రూ.450 కోట్లతో మరో బ్రిడ్జికి ప్రపోజల్స్
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గవర్నమెంట్అధికారంలోకి రావడం, మంచిర్యాల ఎమ్మెల్యేగా ప్రేమ్సాగర్రావు గెలవడంతో మంచిర్యాల–-అంతర్గాం బ్రిడ్జికి బ్రేక్ పడ్డది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో మంచిర్యాల, పెద్దపల్లి మధ్య దాదాపు 18 కిలోమీటర్ల దూరం తగ్గుతున్నప్పటికీ హెవీ వెహికల్స్ పూర్తిగా మంచిర్యాల టౌన్నుంచి రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. దీంతో జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ రద్దీ పెరగడం, కాలేజీ రోడ్డు ఇరుకుగా ఉండడం, రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గర సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో ఈ బ్రిడ్జిని రద్దు చేస్తామని ఎమ్మెల్యే పీఎస్సార్ ప్రకటించారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇటు ముల్కల్ల, అటు ముర్మూర్నడుమ గోదావరిపై రూ.450 కోట్ల అంచనాతో మరో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రపోజల్స్ రూపొందించి ప్రభుత్వానికి పంపారు.
పెరిగిన వ్యయం... తగ్గని దూరం
మంచిర్యాల, పెద్దపల్లి మధ్య దూరాభారం తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా మంచిర్యాల–-అంతర్గాం బ్రిడ్జిని గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ప్రస్తుతం మంచిర్యాల, శ్రీరాంపూర్, గోదావరిఖని, బసంత్నగర్ నుంచి రాజీవ్ రహదారి మీదుగా పెద్దపల్లికి వెళ్లాలంటే 40 కి.మీ. ప్రయాణించాలి. మంచిర్యాల–-అంతర్గాం బ్రిడ్జి పూర్తయితే దాదాపు 18 కిలోమీటర్ల దూరం తగ్గేది. మంచిర్యాల నుంచి నేరుగా బసంత్నగర్ రాజీవ్ ఫోర్లైన్కు చేరుకోవచ్చు. కొత్తగా ప్రతిపాదించిన ముల్కల్ల–-ముర్మూర్ బ్రిడ్జి నిర్మాణంతో ఈ రెండు జిల్లా కేంద్రాల మధ్య కేవలం 5కి.మీ. దూరమే తగ్గుతుంది.
పైగా అంచనా వ్యయం రూ.164 కోట్ల నుంచి రూ.450 కోట్లకు అంటే దాదాపు రూ.300 కోట్లు పెరుగుతుంది. అంతర్గాం బ్రిడ్జికి కేవలం 15 ఎకరాల భూమి అవసరం కాగా.. ముల్కల్ల–-ముర్మూర్ బ్రిడ్జికి సుమారు 100 ఎకరాల భూములు సేకరించాల్సి ఉంటుందని అంచనా. ఇప్పటికే ముల్కల్ల శివారులో ఎన్హెచ్63 గ్రీన్ హైవేకు భూములు ఇవ్వబోమని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అటు ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులు కూడా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు.
రాజకీయ రంగు
గోదావరిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు రాజకీయ విమర్శల దాడి చేసుకుంటున్నారు. అంతర్గాం శివారులో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు భూములు ఉండడంతో వాటికి డిమాండ్ పెంచుకునేందుకే ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేయించుకున్నాడని, దీంతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే పీఎస్సార్ కేవలం కమీషన్ల కోసమే అంతర్గాం బ్రిడ్జిని రద్దు చేయించి రూ.450 కోట్లతో ముల్కల్ల–-ముర్మూర్బ్రిడ్జిని తెరపైకి తీసుకొచ్చాడని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు విమర్శిస్తున్నారు. ముల్కల్ల శివార్లలో రియల్ఎస్టేట్ బూమ్పెంచి కమీషన్లు దండుకోవడమే ఆయన ఉద్దేశమని మండిపడుతున్నారు. ఏదేమైనా ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఒప్పించి, గిట్టుబాటు నష్టపరిహారం ఇప్పించి భూసేకరణ కష్టమేనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.