అందుబాటులోకి.. రైతు భరోసా యాప్

అందుబాటులోకి.. రైతు భరోసా యాప్
  • ఆది, సోమవారాల్లో ట్రయల్​ పూర్తి
  • రైతు వివరాల ఎంట్రీ సమయంలో మూడు రకాల ఇబ్బందులు
  • మాఫీ కాని రైతుల నుంచి 'ఫ్యామిలీ అఫిడవిట్​'  తీసుకోనున్న ఆఫీసర్లు
  • నేడు యాప్​పై ప్రిన్సిపల్​ సెక్రటరీ, అగ్రికల్చర్​ డైరెక్టర్​ వీడియో కాన్ఫరెన్స్​

మహబూబ్​నగర్​, వెలుగు: బ్యాంకర్లు, ఆఫీసర్ల పొరపాట్ల వల్ల రుణమాఫీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ర్ట సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు 'రైతు భరోసా' యాప్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆది, సోమవారాల్లో ట్రయల్ పూర్తి కాగా, యాప్​లో చేయాల్సిన మార్పు, చేర్పులపై మంగళవారం అన్ని జిల్లాల వ్యవసాయాధికారులతో ప్రిన్సిపల్​ సెక్రటరీ, అగ్రికల్చర్​ డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించనున్నారు. వీసీలో వచ్చిన సూచనలు, సలహాల మేరకు యాప్​లో మార్పులు, చేర్పులు చేయనున్నారు.

Also Read:-కార్పొరేట్ సేవలో జీవన్‌‌‌‌‌‌‌‌దాన్‌‌‌‌‌‌‌‌

మొదట ఫ్యామిలీ గ్రూపింగ్​

రాష్ర్ట సర్కారు రూ.2 లక్షలలోపు లోన్లు తీసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు పంద్రాగస్టులోపు రూ.2 లక్షలలోపు లోన్లు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేసింది. కానీ కొన్ని టెక్నికల్​సమస్యల వల్ల చాలా మందికి రుణాలు మాఫీ కాలేదు. 31 రకాల ఇబ్బందుల వల్ల చాలా మందికి లోన్లు మాఫీ కాలేదని అగ్రికల్చర్​ ఆఫీసర్లు గుర్తించి, ఆ రిపోర్టును ఇటీవల రాష్ర్ట సర్కారుకు అందించారు.

ఇందులో ప్రధానంగా రేషన్​ కార్డల్లో కుటుంబ సభ్యుల వివరాలు తప్పుగా ఉండడం, అర్హుల పేర్లు రేషన్​ కార్డుల్లో ఒకలా, ఆధార్​ మరోలా ఉండడం.. ఆధార్​ నంబర్లు తప్పుగా పడడం, అర్హుల పేర్లు ఆధార్​లో ఒకలాగా, బ్యాంక్​ అకౌంట్​లో మరో లా పడడం లాంటి సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు రాష్ర్ట సర్కారు తొమ్మిది రోజుల్లోనే 'రైతు భరోసా యాప్​'ను అందుబాటులోకి తెచ్చింది. మొదట యాప్​లో రుణమాఫీ కాని రైతు కుటుంబ సభ్యుల వివరాలను (ఫ్యామిలీ గ్రూపింగ్​) ఎంట్రీ చేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు గత శనివారం రాష్ర్టంలోని అన్ని మండలాల వ్యవసాయాధికారులు యాప్​ను డౌన్​లోడ్​ చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వారి ఆదేశానుసారం యాప్​ను డౌన్​లోడ్​ చేసుకున్న మండల వ్యవసాయధికారులు.. సర్కారు సూచనలు మేరకు ఆది, సోమవారాల్లో ట్రయల్​ నిర్వహించారు. ప్రతి మండలంలోని ఒక రైతు కుటుంబ వివరాలు ఎంట్రీ చేశారు. 

బ్యాంకర్ల నుంచి వివరాల సేకరణ

రుణమాఫీ కాని రైతుల వివరాలు మండల వ్యవసాయాధికారులకు అందజేయాలని రాష్ర్ట సర్కారు బ్యాంకర్లను ఆదేశించింది. దీంతో వారు రుణాలు మాఫీ కాని వివరాలను రెడీ చేసి మండల వ్యవసాయధికారులకు అప్పగించే పనిలో ఉన్నారు. ఒకటి రెండో రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. బ్యాంకర్లు ఇచ్చిన వివరాల ఆధారంగా యాప్​ లాగిన్​ ఉన్న మండల వ్యవసాయధికారులు ప్రతి గ్రామంలో పర్యటించనున్నారు. లిస్టులో ఉన్న పేర్ల ఆదారంగా ప్రతి రైతు ఇంటి వద్దకు వెళ్లి యాప్​లో వివరాలు నమోదు చేయనున్నారు. 

అఫిడవిట్‌‌‌‌‌‌‌‌ తప్పనిసరి

జనరల్​ ట్రాన్స్​ఫర్స్​లో భాగంగా అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్​లో ఇటీవల చాలా మంది ఆఫీసర్లు ఒక మండలం నుంచి మరో మండలానికి బదిలీ అయ్యారు. ఈ క్రమంలో కొత్తగా మండలానికి వచ్చిన ఆఫీసర్లకు  ఎంక్వైరీ సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. ఈ సమస్యకు చెక్​ పెట్టేందుకు రైతుల నుంచి ఫ్యామిలీ అఫిడవిట్లు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు రుణమాఫీ కాని రైతు తమ కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? అనే వివరాలతో ఫ్యామిలీ అఫిడవిట్​ను పంచాయతీ సెక్రటరీ లేదా గెజిటెడ్ ఆఫీసర్​ సిగ్నేచర్​తో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్​ను సర్వేకు వచ్చే ఆఫీసర్​కు అందించాల్సి ఉంటుంది. వారు ఈ సర్టిఫికెట్​ను ఫొటోలు తీసి, యాప్​లో అప్​లోడ్​ చేస్తారు. ఇందుకు సంబంధించి  రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రానున్నాయి. 


ఎంట్రీ సమయంలో ఆఫీసర్లకు మూడు రకాల ఇబ్బందులు

1.ఒక మండలానికి చెందిన రైతు ఆ మండలంలోని బ్యాంకులో కాకుండా మరో మండలంలోని బ్యాంకులో క్రాప్​ లోన్​ తీసుకొని ఉంటే యాప్​లో ఆ రైతు వివరాలు ఎంట్రీ కావడం లేదు. 
2.యాప్​లో రిలేషన్స్ ఆప్షన్​లో కూతురు, కుమారుడు పేర్లు మాత్రమే డిస్​ప్లేలో ఉన్నాయి. దీని వల్ల కోడళ్లు, అల్లుళ్లు,  మనువళ్లు, మనుమరాండ్లు, నాన్నమ్మ, తాతయ్య వంటి పేర్లు ఎంట్రీ చేయడానికి ఇబ్బందులు వస్తున్నాయి.
3.భర్త పేరు మీద భూమి ఉండి ఆయన చనిపోతే ఆధార్ నంబర్​ లేకపోవడం.. భార్య పేరు మీద భూమి ఉండి ఆమే చనిపోతే ఆధార్​ నంబర్​ లేకపోతే యాప్​లోవివరాలు ఎంట్రీ కావడం లేదు.