జిల్లా యూనిట్​గా డెవలప్​మెంట్​

జిల్లా యూనిట్​గా డెవలప్​మెంట్​
  • స్థానిక అవసరాలకు తగ్గట్టు నిధులు.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
  • అనుకూలతలను బట్టి ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటు
  • ఎంపీలు , ఎమ్మెల్యేలు , కలెక్టర్ల నుంచి ప్రతిపాదనల సేకరణ
  • డెవలప్​మెంట్​ ప్రోగ్రామ్స్​ కోసం స్పెషల్​ యాక్షన్​ ప్లాన్
  • ప్రభుత్వ పెద్దల జిల్లాలకే అభివృద్ధి పరిమితమన్న విమర్శ రాకుండా చర్యలు

హైదరాబాద్​, వెలుగు: జిల్లాల్లో స్థానిక అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి పనులు చేపట్టాలని, నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏ జిల్లాకు ఆ జిల్లాను యూనిట్​గా తీసుకుని డెవలప్​మెంట్​ కార్యక్రమాలు చేపట్టనుంది. అనుకూలతలను బట్టి ప్రాజెక్టులు, పరిశ్రమలు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలనుకుంటున్నది.

ఇందుకోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ల నుంచి ప్రపోజల్స్​ తీసుకోనుంది. ఫలితంగా ఆయా ప్రాంత ప్రజల డిమాండ్లు, అవసరాలు తీరుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అదే సమయంలో రాష్ట్రమంతా సమాంతరంగా అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నది. 

పేరుకే జిల్లాలు.. సౌలతుల్లేవ్​!

జిల్లాల్లో గత సర్కార్​ ఇప్పటి వరకు ఏమేం చేసిందనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం వివరాలు సేకరిస్తున్నది. కొత్త జిల్లాల పేరుతో హడావుడి చేసి.. ఆయా జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు తప్ప కనీస సౌలతులు కూడా గత సర్కార్​ కల్పించలేదనేది ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

కొన్ని జిల్లాల్లో అసలు ఉపాధి అవకాశాలు లేవని.. నీటి వనరులున్నా వాడుకోలేని పరిస్థితులు కల్పించారని.. ఉన్నత విద్య కాలేజీలు, రోడ్లు ఇతరత్రా వంటి ముఖ్యమైనవి కూడా లేవని తేలింది. వీటిని పరిష్కరించడంపై ప్రభుత్వం స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. ఇందుకోసం అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్​లో ఎమ్మెల్యేలు లేవనెత్తే సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నది. 

ప్రత్యేక యాక్షన్​ ప్లాన్​తో ముందుకు..!

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారివారి జిల్లాలకు, నియోజకవర్గాలకు అవసరమైన డెవలప్​మెంట్​ కార్యక్రమాల కోసం సాధారణంగా సీఎంకు వినతి పత్రాలు ఇస్తూ ఉంటారు. ఒకే జిల్లాలో ఒకే అంశానికి సంబంధించి మంత్రి, ఎమ్మెల్యే, స్థానిక లీడర్లు విన్నవించుకోవడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే, జిల్లాలవారీగా ఆయా ప్రాంతాల్లో ఏం చేయాలనేదానిపై ఒక ప్లాన్​ను ముందే తీసుకుంటే ఎలా ఉంటుందని ఉన్నతాధికారులను సీఎం రేవంత్​ రెడ్డి ఆరా
తీసినట్లు తెలిసింది. 

నాలుగున్నరేండ్లు ప్రభుత్వానికి సమ యం ఉందని.. ఇప్పుడే ఒక యాక్షన్​ ప్లాన్​ రెడీ చేసుకొని ముందుకు వెళ్లాలని అభిప్రాయపడ్డట్లు సమాచారం. దీంతో ఏ జిల్లాకు ఆ జిల్లా డెవలప్​మెంట్​ యాక్టివిటీస్  అద్భుతంగా అమలు చేసుకునే వీలుంటుందని ఆయన అన్నట్లు తెలిసింది. కేవలం ప్రజాప్రతినిధుల సిఫార్సులే కాకుండా.. జిల్లా లెవెల్​లో కలెక్టర్ల నుంచి కూడా ఆయా జిల్లాలకు ఏం అవసరం అనేదానిపై ప్రపోజల్స్​ తీసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. 

నిధులకు ఢోకా లేకుండా..

పక్కా ప్లాన్​తో వెళ్తే జిల్లా యూనిట్​గా చేపట్టే డెవలప్​మెంట్​ కార్యక్రమాలకు నిధుల ఢోకా కూడా ఉండదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అప్పటికప్పుడు జిల్లాలకు వెళ్లినప్పుడు సీఎం హామీలు ఇవ్వడం లేదా స్థానిక ఎమ్మెల్యే ఏదైనా కోరితే దానికి గ్రీన్​సిగ్నల్​ ఇవ్వడం వంటివి జరుగుతుంటాయి. అయితే దానికి కావాల్సిన నిధులను స్పెషల్​ ఫండ్స్​ కింద ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఇంకో ఫైనాన్షియల్​ ఇయర్​లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. దీనికి బదులు ముందే ఒక ప్రణాళిక రెడీ చేసుకుంటే.. బడ్జెట్​లో నిధులను కేటాయించుకునేందుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.

ఇక ప్రభుత్వం ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఫండ్స్​ కేటాయిస్తున్నది. ఏడాదికి రూ. 5 కోట్ల చొప్పున గత ప్రభుత్వం పద్దు చూపింది. ఈ నిధులకు తోడు జిల్లాల అభివృద్ధికి  ప్రత్యేకంగా మరిన్ని నిధులు ఇస్తే ఎలా ఉంటుందనే దానిపైనా సీఎం రేవంత్​రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం.

అన్ని జిల్లాలకు సమాంతరంగా అభివృద్ధి ఫలాలు

సీఎం జిల్లాలో, డిప్యూటీ సీఎం జిల్లాలో, ఫలానా మంత్రి ఇలాకాలో మాత్రమే అభివృద్ధి జరిగిందన్న విమర్శ రాకుండా,  అన్ని జిల్లాల్లో డెవలప్​మెంట్​ కనిపించేలా కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది

గత ప్రభుత్వంలో కేవలం సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకే ఎక్కువ నిధులు వెళ్లాయనే విమర్శ జనంలో ఉందని, ఇప్పుడు అన్ని జిల్లాలకు సమాంతరంగా అభివృద్ధి ఫలాలు అందేలా ప్లాన్​ రెడీ చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.