
ఇందిరమ్మ ఇళ్ల కోసం కొత్తగా గత నెలలో 4 రోజుల పాటు గ్రామసభలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ఇళ్లకు సుమారు లక్ష అప్లికేషన్లు వచ్చాయి. అయితే కొత్తగా లబ్ధిదారులను గుర్తించే అంశంపై ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి వినతులు రావడంతో ప్రభుత్వం పలు సవరణలు చేసింది. ఇందులో నెల వేతనం రూ.15,000 కన్నా తక్కువ ఉన్న ఉద్యోగులు కూడా ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు అర్హులని.. అంగన్ వాడీ కార్యకర్తలు, ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ ఉద్యోగులు ఈ జాబితాలో ఉంటారని సర్క్యులర్ లో పేర్కొంది.
మండలాలు, మున్సిపాలిటీలలో ఇటుక తయారీ యూనిట్స్, సెంట్రింగ్ యూనిట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పీడీలను ఎండీ ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ ఇళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాల పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని, ప్రారంభించిన పనులు ఏమైనా ఉంటే గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లు వాటి పనులను చేపట్టి పూర్తి చేయాలని సర్క్యులర్ లో ఎండీ పేర్కొన్నారు.
ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను అందుకున్న లబ్ధిదారులు మార్చి 10 వరకు బేస్ మెంట్ స్థాయి దాకా వర్క్ స్టార్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు డైరెక్టర్లను హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ ఆదేశించారు. ఈ స్కీమ్ పై ఇటీవల అన్ని జిల్లాల పీడీలకు ఎండీ సర్క్యులర్ జారీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ గైడ్లైన్స్లో మంజూరు పత్రం అందుకున్న 45 రోజుల్లోగా ఇండ్ల పనులు ప్రారంభించాలని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే అంశం ఉందని, దానినే ఇపుడు అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
అప్పటి వరకు పునాదులు తీసి బేస్ మెంట్ నిర్మిస్తే ఫస్ట్ ఫేజ్ అమౌంట్ రూ.1 లక్ష ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రూ.5 లక్షలను బేస్ మెంట్ దశలో రూ.లక్ష, గోడలు కట్టిన తరువాత రూ.1. 25 లక్షలు, స్లాబ్ పూర్తయ్యాక రూ.1.75 లక్షలు, ఇల్లు పూర్తయిన తరువాత రూ.లక్షను ప్రభుత్వం లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. వచ్చే నెలలో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో అప్పటి వరకు స్కీమ్ అమలుకు దశల వారీగా నిధులు రిలీజ్ చేయనుంది.