
ఉపాధి కూలీలకు మహాశివరాత్రి రోజు గుడ్ న్యూస్ . ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు ఫిబ్రవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు జమ చేసింది. జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతి మండలంలోని ఒక పైలెట్ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కూలీల ఖాతాల్లో నిధులు జమ చేసింది ప్రభుత్వం. మొత్తం 18,180 మందికి 6 వేల చొప్పున జమ చేసింది. ఆ తర్వాత మండలి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కు బ్రేక్ పడింది.
అయితే ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మంత్రి సీతక్కవిజ్ఞప్తి చేసింది. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసింది. ఆ రెండు జిల్లాల్లో 66,240 మంది ఉపాధి కూలీ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను చెల్లించిన ప్రభుత్వం. 66,240 మంది కూలీల ఖాతాల్లో 39.74 కోట్లు జమ చేసింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకు 50.65 కోట్లు చెల్లించింది ప్రభుత్వం . ఎన్నికల కోడ్ ముగియగానే మిగతా జిల్లాల్లో లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను చెల్లించనుంది ప్రభుత్వం
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఉపాధి కూలీలకు ఆర్దిక చేయుత కల్పిస్తూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఏడాదికి రెండు విడతలుగా రూ.12 వేలు ఇవ్వనుంది. ఒక సీజన్ కు 6000 రూపాయలు చొప్పున కూలీలకు భరోసా కల్పిస్తోంది. డిబిటి పద్ధతిలో ఉపాధి కూలీల ఖాతాల్లోకి నేరుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను జమ చేస్తుంది ప్రభుత్వం.