
- రెండు టైగర్ జోన్లలో 682 ఫ్యామిలీలు తరలించేలా చర్యలు
- పునరావాస ప్యాకేజీ కిందరూ.15 లక్షలు పరిహారం
- అన్ని సౌలతులతో కాలనీలు
- గూడేల తరలింపునకు రూ.200 కోట్లు కేటాయింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పులుల ఆవాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇటీవల అభయారణ్యంలో పెద్ద పులుల సంచారం పెరిగిపోయింది. మనుషుల అలజడి కారణంగా అభయారణ్యంలో టైగర్లు స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవట్లేదు. మనుషులపై దాడులు చేస్తుండటంతోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పెద్ద పులులు, మనుషుల మధ్య సంఘర్షణ పెరిగిపోవడంతో టైగర్ జోన్లలోని గ్రామాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే టైగర్ జోన్లోని కొన్ని గ్రామాలను తరలించి పునరావాసం కల్పించగా.. తాజాగా మరిన్ని గ్రామాలను టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి తరలించి బాధితులకు పునరావాసం కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పునరావాస ప్యాకేజీలో భాగంగా రూ.200 కోట్లకుపైగా నిధులు కేటాయించగా.. అమ్రాబాద్ ఫారెస్ట్లో నాలుగు, కవ్వాల్లో మూడు గూడేల తరలింపుపై అధికారులు దృష్టిపెట్టారు. ఇందుకు ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షలు లేదా ఇల్లు నిర్మించడంతోపాటు కాలనీ ఏర్పాటు చేయనున్నారు. అన్ని వసతులు కల్పించనున్నారు. బాధితులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నారు. బాధితులు ఎవరైనా ప్రభుత్వం చూపించిన పునరావాస కాలనీలో ఉండకపోతే వారికి ప్యాకేజీ కింద రూ.15 లక్షల పరిహారం ఇవ్వనున్నారు.
అమ్రాబాద్లో 1,260 కుటుంబాల తరలింపు
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో దాదాపు 28 గ్రామాలుండగా.. 1,260 కుటుంబాలను రెండు విడతల్లో తరలించేందుకు అటవీశాఖ ప్రణాళిక రూపొందించింది. తొలి విడతలో 4 గ్రామాలు సార్లపల్లి, కుడిచింతలబైలు, కొల్లంపెంట, తాటిగండ్ల గ్రామాల నుంచి 417 కుటుంబాలను పెద్దకొత్తపల్లి మండలం బచారం టెరిటోరియల్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకు తరలిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రెండో విడతలో 836 చెంచు కుటుంబాలను ఇతర ప్రాంతాలకు తరలించనున్నారు.
ఇందు కోసం దాదాపు రూ.160 కోట్లు ఖర్చు అవుతాయని అటవీశాఖ అధికారులు అంచనా వేశారు. బాచారం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో 1,500 హెక్టార్ల భూమిని గుర్తించారు. రిజర్వ్ ఫారెస్ట్ భూములను డీనోటిఫై చేయాలని కేంద్రానికి కూడా ప్రతిపాదనలు పంపించారు. కాగా, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏరియాలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. మనుషుల అలికిడి ఉంటే పులుల సంచరించవనే ఉద్దేశ్యంతో ప్రధాన ప్రాంతాల నుంచి గ్రామాల తరలింపుపై అటవీశాఖ అధికారులు ఫోకస్ పెంచారు.
కవ్వాల్ నుంచి మరో 3 గ్రామాల తరలింపు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ అభయారణ్యం కోర్ ఏరియా 892.23 చదరపు కిలో మీటర్లు, బఫర్ ఏరియా 1,123.21 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. టైగర్ జోన్లో ఉన్న దాదాపు15 గ్రామాలు తరలించేందుకు అటవీశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా జన్నారం డివిజన్లోని అల్లీనగర్, దొంగపెల్లి, మల్యాల గ్రామాల తరలింపునకు రంగం సిద్ధం చేశారు. మొదటి విడతలో నిర్మల్ జిల్లాలోని మైసంపేట, రాంపూర్ గ్రామాలను తరలించారు. వీరికి నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొత్తమద్దిపడగ శివారులో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇచ్చారు.
అక్కడ గ్రామానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించడంతో పునరావాస బాధితులు అక్కడే నివాసం ఉంటున్నారు. జన్నారం మండలంలోని అల్లీనగర్, దొంగపెల్లి, మల్యాల గ్రామాల తరలింపునకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మూడు గ్రామాల్లో 265 కుటుంబాలు ఉన్నట్లు అధికారుల సర్వేలో తేలింది. వీరిని మంచిర్యాల జిల్లాలోని ముల్కలకు తరలించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు ఈ గ్రామాల ప్రజలను ముల్కలకు తీసుకెళ్లి గ్రామాన్ని చూపించి వారికి కల్పించే సౌకర్యాలపై అధికారులు వివరించడంతో వారు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేశారు.