పాలమూరు కాలేజీలకు నిధులు : యెన్నం శ్రీనివాస్​రెడ్డి

పాలమూరు కాలేజీలకు నిధులు : యెన్నం శ్రీనివాస్​రెడ్డి
  • బాయ్స్​ జూనియర్​ కాలేజ్, ఒకేషనల్​ కాలేజీలకు రూ.5.10 కోట్లు మంజూరు
  • అడ్మినిస్ట్రేటివ్​ శాంక్షన్​ ఇచ్చిన ఇంటర్మీడియట్​ బోర్డ్
  • క్లాస్​ రూమ్స్​, సైన్స్​ ల్యాబ్, టాయిలెట్స్​ నిర్మాణానికి ఖర్చు

మహబూబ్​నగర్, వెలుగు:మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని గర్నమెంట్​ బాయ్స్​ జూనియర్​ కాలేజ్, ఒకేషనల్​ కాలేజ్​​డెవలప్​మెంట్​కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ రెండు కాలేజీల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు పంపగా.. రూ.5.10 కోట్ల నిధుల మంజూరుకు తెలంగాణ బోర్డ్​ ఆఫ్​ ఇంటర్మీడియట్​ ఎడ్యుకేషన్ (టీజీబీఐఈ)​ అడ్మినిస్ట్రేటివ్​ శాంక్షన్​ ఇచ్చింది. ఫండ్స్​తో క్లాస్​ రూములు, ల్యాబ్స్, ఇతర ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కోసం కేటాయించగా..  ఈ నెలాఖరు వరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. వచ్చే అకడమిక్​ ఇయర్​లోపు​ ల్యాబ్స్, క్లాస్​ రూములు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

1969లో ప్రారంభం..

మహబూబ్​నగర్​ గవర్నమెంట్​ బాయ్స్​ జూనియర్​ కాలేజీకి 60 ఏండ్ల చరిత్ర ఉంది. ప్రస్తుతం ఉన్న ఈ​ కాలేజ్​ బిల్డింగ్​కు వందేళ్ల చరిత్ర ఉంది. స్వాతంత్ర్యం రాక ముందు నిజాం నవాబులు ఈ భవనాన్ని నిర్మించారు. అయితే బిల్డింగ్​కు సంబంధించిన పాత రికార్డులు అందుబాటులో లేవు. రాష్ట్రాల పునర్విభజన​సమయంలో ఈ రికార్డులు మిస్​ అయినట్లు తెలిసింది. ఈ బిల్డింగ్​ను 1948లో మల్టీపర్సస్ హైస్కూల్​ కోసం కేటాయించారు. 1969–70 అకడమిక్​ ఇయర్​లో మహబూబ్​నగర్​కు గవర్నమెంట్​ జూనియర్​ కాలేజ్​ మంజూరు కాగా.. కాలేజ్​ కోసం ఈ బిల్డింగ్​ను అలాట్​ చేశారు. ఇక్కడున్న మల్టీపర్పస్​ హైస్కూల్​ను వేరే చోటుకు తరలించారు. ప్రస్తుతం ఈ బిల్డింగులో సరిపడా క్లాస్​ రూమ్స్​ లేవు. 

అలాగే ఈ కాలేజికి చెందిన ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ల్యాబ్​లకు నాలుగు గదులు ఉండగా.. శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని కూల్చేశారు. ఖాళీగా ఉన్న ఈ స్థలాన్ని గవర్నమెంట్​ ఒకేషనల్​ బిల్డింగ్​కు అలాట్​ చేశారు. అయితే ప్రస్తుతం జూనియర్​ కాలేజ్​లో స్టూడెంట్ల సంఖ్య పెరుగుతోంది. అందుకు అనుగుణంగా క్లాస్​ రూమ్ లు, ల్యాబ్​ అవసరం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ల్యాబ్స్​ కోసం నాలుగు రూములు, రెండు అడిషనల్​ క్లాస్​ రూమ్స్, టాయిలెట్స్​ నిర్మించనున్నారు.

ఒకేషనల్​ కాలేజ్​కు రూ.3.10 కోట్లు..

బాయ్స్​ జూనియర్​ కాలేజీలోని ల్యాబ్​ బిల్డింగ్​లను కూల్చేసి, ఆ స్థలంలో ఒకేషనల్​ కాలేజ్​ బిల్డింగ్​ పనులను ప్రారంభించారు. ఈ పనులు కొద్ది రోజులుగా అసంపూర్తిగా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించగా.. పనులు నిలిచిపోయాయి. దీంతో ఈ కాలేజీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.3.10 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్​ నిర్మాణ పనులు, తలుపులు, కిటికీలు, రంగులు వేయడం, సైన్స్​ ల్యాబ్స్​, డ్యుయల్​ డెస్క్, ఫర్నీచర్​ కోసం వెచ్చించనున్నారు.

ఎమ్మెల్యే చొరవతోనే..

ఈ రెండు కాలేజీల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని సిబ్బంది గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు ప్రతిపాదనలు పెట్టారు. కానీ, ఎలాంటి రెస్పాన్స్​ రాలేదు. ఇటీవల ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి కాలేజ్​ను విజిట్​ చేయగా.. సిబ్బంది రెండు కాలేజీల్లోని సమస్యలను ఆయనకు వివరించారు. స్పందించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్స్ అందజేసి, నిధులు విడుదల చేయాలని కోరారు. రెండు కాలేజీలకు రూ.5.10 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో, టెండర్లు పిలిచి త్వరలో పనులు ప్రారంభించనున్నారు.