
- మత్స్య సంపద అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
- అమెరికా ఫిష్ఇన్ కంపెనీ ఆధ్వర్యంలో కేజ్ కల్చర్
- ఇప్పటికే నడుస్తున్న ట్రయల్రన్
రాజన్నసిరిసిల్ల, వెలుగు: మిడ్ మానేరు కేంద్రంగా మత్స్య సంపద అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మిడ్మానేరులో కేజ్ కల్చర్ ఏర్పాటు చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు బ్యాక్ వాటర్లో లేటెస్ట్ టెక్నాలజీతో అమెరికా ఫిష్ఇన్ కంపెనీ పంజరం వలల ద్వారా చేపల పెంపకానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కంపెనీ పదేండ్లపాటు మిడ్మానేరులో కేజ్ కల్చర్ నిర్వహించేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.
ముందుకెళ్లని అక్వాహబ్
గత ప్రభుత్వం మిడ్ మానేరు కేంద్రంగా అక్వా హాబ్ ఏర్పాటుకు నిర్ణయించింది. దీనికోసం 367 ఎకరాలు సేకరించింది. దీని ద్వారా 10వేల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పింది. అయితే ఈ ప్రాజెక్ట్ కింద తట్టెడు మట్టి కూడా తీయలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కేజీ కల్చర్ను అభివృద్ధి చేసేందుకు సంకల్పించింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కేజ్ కల్చర్ ద్వారా చేపల పెంపకానికి యూనిట్లు ఏర్పాటు చేస్తోంది.
10 పంజర వలలతో ట్రయల్ రన్
మిడ్ మానేరులో అమెరికా ఫిష్ఇన్ కంపెనీ 600 కేజేస్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా పొందింది. మొదటి దఫాలో 300 కేజేస్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా టెన్ కేజేస్ ట్రయల్ రన్ను ప్రారంభించింది. 10 కేజీల వరకు ఉండే చేపలను పెంచేందుకు ఫిష్ఇన్ కంపెనీ మిడ్మానేరులో ఇప్పటికే 8 సర్య్యూలర్లను ఏర్పాటు చేసింది. జూన్, జులై నెలల్లో మరిన్ని యూనిట్లు పెట్టనున్నారు.
ప్రస్తుతం ఏర్పాటు చేసిన ట్రయల్ రన్ సక్సెస్ అయితే మరిన్ని కంపెనీలు చేపల పెంపకానికి ముందుకు వస్తాయని ఆఫీసర్లు చెప్తున్నారు. దీని ద్వారా రాజన్న జిల్లాలో మత్స్య సంపద పెరుగుతుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. కేజ్ కల్చర్లో తిలాపియా రకం చేపలు పెంచనున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ రకం ఆరు నెలల్లోనే పెరుగుతాయంటున్నారు.