
- చీఫ్గా ఐజీ రమేశ్రెడ్డి.. సభ్యులుగా సింధుశర్మ, వెంకటలక్ష్మి, చంద్రకాంత్, శంకర్
- దర్యాప్తును పర్యవేక్షించనున్న సీఐడీ చీఫ్ డీజీ శిఖాగోయల్
- 90 రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని డీజీపీ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: ఆన్లైన్ బెట్టింగ్స్ పనిపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుల దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ( సిట్)ను ఏర్పాటు చేసింది. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) రమేశ్రెడ్డి చీఫ్గా మరో నలుగురు సభ్యులతో సిట్ను ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. సభ్యులుగా ఇంటెలిజెన్స్ ఎస్పీ సీహెచ్ సింధుశర్మ, సీఐడీ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఎస్పీ కె. వెంకటలక్ష్మి, సైబరాబాద్ అడిషనల్ ఎస్పీ(అటాచ్డ్) ఎస్. చంద్రకాంత్, సీఐడీ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ డీఎస్పీ ఎం. శంకర్ను నియమించారు. సీఐడీ చీఫ్ డీజీ శిఖాగోయల్ సిట్ దర్యాప్తును పర్యవేక్షిస్తారు.
90 రోజుల్లో రిపోర్ట్
పంజాగుట్ట, మియాపూర్ పోలీస్స్టేషన్లలో నమోదైన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులను సిట్కు బదిలీ చేయాలని సంబంధిత అధికారులకు సోమవారమే ఆదేశాలు అందాయి. దర్యాప్తు చేసేందుకు అవసరమైన ఆర్థిక నిపుణులు, లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఆడిటర్లు, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్టులు సహా ఎలాంటి అధికారినైనా సరే సీఐడీ డీజీ ఆమోదంతో నియమించుకోవచ్చని డీజీపీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పూర్తి నివేదికను 90 రోజుల్లోగా అందించాలని ఆదేశించారు. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ను నియంత్రించేందుకు రాష్ట్రం, కేంద్రం అమలు చేస్తున్న చట్ట సవరణలకు అవసరమైన సిఫార్సులు చేయాలని సూచించారు.
డీజీపీ ఆఫీస్ కేంద్రంగానే సిట్ ఆఫీస్
డీజీపీ ఆఫీస్ కేంద్రంగా సిట్ పనిచేయనుంది. ఇందుకుగాను అవసరమైన ఆఫీస్ సెటప్ను రెండురోజుల్లో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మియాపూర్, పంజాగుట్ట, సూర్యాపేట పోలీస్స్టేషన్లతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నమోదైన బెట్టింగ్ కేసుల, యువకుల ఆత్మహత్యలకు సంబంధించిన కేసులను సిట్ పరిగణనలోకి తీసుకోనుంది, ఈ మేరకు అవసరమైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబర్ క్రైమ్ పోలీసులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నైపుణ్యం ఉన్న ఏసీపీలు, ఎస్ఐలతో ప్రత్యేక సిబ్బందిని సిట్ చీఫ్ నియమించుకోనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు యూనిట్ల అధికారులతో సిట్ చీఫ్ రమేశ్రెడ్డి చర్చించినట్లు తెలింసింది. మంగళవారం నుంచే తమ కార్యకలాపాలను నిర్వహించేందకు పూర్తి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
సిట్ విధి విధానాలు..
1. సిట్కు బదిలీ అయిన అన్ని ఆన్లైన్ బెట్టింగ్ కేసులను సమగ్ర దర్యాప్తు చేయాలి. సిట్ దర్యాప్తుకు అన్ని ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలు తప్పనిసరి సహకారం అందించాలి.
2. ఆన్లైన్ బెట్టింగ్/గేమింగ్లను అధ్యయనం చేసి, వాటిని నిరోధించడానికి అవసరమైన చర్యలను తప్పనిసరిగా సిఫారసు చేయాలి.
3. వీటికి చట్టపరమైన అనుమతులు, నిబంధనలు, షరతులు, బెట్టింగ్ నిర్వహణ, ప్రమోషన్స్, అడ్వర్టైజ్మెంట్ను నియంత్రించేందుకు అవసరమైన చట్టపరమైన చర్యలు సూచించాలి.
4. బెట్టింగ్, గేమింగ్ నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీలు, ఇన్కమ్ట్యాక్స్ డిపార్ట్మెంట్, జీఎస్టీ, సమాచార ప్రసార, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ, హోం మంత్రిత్వ శాఖలతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్కు ఎలాంటి బాధ్యతలు ఉంటాయో గుర్తించాలి.
5. ఇల్లీగల్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్లో జరిగే అనధికారిక లావాదేవీలను గుర్తించి బ్లాక్ చేసేందుకు.. ఆయా పేమెంట్ సిస్టమ్, ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్పై చర్యలు తీసుకునే అంశాలను ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లాలి.