
ఎర్త్ అవర్ సందర్భంగా తెలంగాణ సచివాలయంలోని లైట్లు అన్నీ ఆఫ్ చేశారు అధికారులు. మార్చి 22న రాత్రి 8.30గంటల నుంచి 9.30గంటల వరకు లైట్లు ఆఫ్ చేశారు అధికారులు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సూచన మేరకు ఎర్త్ అవర్ ను పాటిస్తామని సీఎస్ శాంతి కుమారి మార్చి 21న ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే.
పర్యావరణ అవగాహన కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏడాది మార్చి 22న ఎర్త్ అవర్ ను పాటిస్తారు. కోట్లాది ప్రజలు ఇండ్లలో ,ఆఫీసుల్లో ఓ గంట సేపు విద్యుత్ లైట్లు ఆఫ్ చేస్తారు. ఇలా చేయడం వలన పర్యావరణ పరిరక్షణకు ఎంతో కొంత సహకరించిన వారవుతారని నిపుణులు చెబుతారు.
ప్రతి ఏటా ఎర్త్ అవర్
ఎర్త్ అవర్ అనేది వరల్డ్ వైల్డ్ లైఫ్ పండ్ (WWF) నిర్వహించే ప్రపంచ వ్యాప్త ఉద్యమం. ప్రకృతి మనకు ప్రతి ఏటా 125 ట్రిలియన్ డాలర్ల విలువగల ఆహారం, నీరు, గాలి మరియు ఇతర సేవలు అందిస్తోంది. అభివృద్ధి పేరుతో గత 50 సంవత్సరాల నుంచి ప్రకృతికి కనివినీ ఎరుగని నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో కర్బన ఉద్గారాలను తగ్గించడం, భూతాపం, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా.. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్) ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తొలిసారిగా ఈ ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గత 19 ఏండ్లుగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులపై ప్రజలకు అవగహన కల్పించేందుకు ఈ సంస్ధ ప్రతి ఏటా'ఎర్త్ అవర్' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో గృహాలు, వ్యాపార కేంద్రాలు, ఇతర కార్యాలయాల్లో గంటపాటు విద్యుత్ కాంతులను ఆపివేసి పర్యావరణానికి మేలు చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.