
సెప్టెంబర్ వచ్చినా చెరువుల్లో సీడ్ పోస్తలేరు
సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో మొదలే కాలే
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: మత్స్య సహకార సంఘాలకు ప్రభుత్వం ఫ్రీగా చేప పిల్లలు పంపిణీ చేస్తున్న చేప పిల్లల పంపిణీ ఈ సారి లేటవుతోంది. అదుటు దాటిపోతున్నా జిల్లాలో చేప పిల్లల పంపిణీ మొదలు కాలేదు. దీంతో మత్స్య కారులు ఆందోళన చెందుతున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయినా చేప పిల్లల విడుదలలో ఆలస్యం అవుతోందని ఆవేదన చెందుతున్నారు. జులైలో కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి మెదక్ జిల్లాలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, రిజర్వాయర్లు పూర్తిగా నిండాయి.
దీంతో చేపల పెంపకానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయని మత్స్యకారులు సంతోషించారు. కానీ, చేప చేప పిల్లల సరఫరా ఆలస్యం అవుతుండటం వారిని నిరాశకు గురిచేస్తోంది. జులై లో నీటి వనరుల్లో చేప పిల్లలు వదిలితే సరైన సైజ్ పెరుగుతాయని, మంచి దిగుబడి వస్తుందంటున్నారు. అయితే ఆగస్టు నెల ముగిసినా ఇంకా చెరువుల్లో చేప పిల్లలు వదలకపోవడం దిగుబడిపై ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందలాది చెరువుల్లో చేప పిల్లలు వదలడానికి సెప్టెంబర్ నెలాంతా పట్టే అవకాశం ఉంది. నెలల సమయం పడితే చేప పెరగదని, ఆర్థికంగా నష్టపోతాని మత్స్యకారులంటున్నారు.
మెదక్ జిల్లాలో....
జిల్లా వ్యాప్తంగా 273 మత్స్యసహకార సంఘాలు (సొసైటీ) ఉన్నాయి. వాటిల్లో 17 వేల మందికి పైగా మత్స్యకారులు మెంబర్లుగా ఉన్నారు. సొసైటీల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 1,618 చెరువులు, జిల్లా సరిహద్దులోని పోచారం ప్రాజెక్ట్ లో చేపల పెంపకం చేపడతారు. ఈ సీజన్ లో రూ.5.06 చేప పిల్లలు (సీడ్) పంపిణీ చేయాలని ఫిషరీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది. ఈ మేరకు టెండర్ల ప్రక్రియ పూర్తయినా చేప పిల్లల విడుదలలో ఆలస్యం జరుగుతోంది. ఇప్పటి వరకు మెదక్ మండలం కొంటూర్ చెరువులో, వెల్దుర్తి కుడిచెరువులో మాత్రమే చేప పిల్లలు వదిలారు.
సిద్దిపేట జిల్లాలో...
జిల్లాలో 357 సొసైటీలు ఉండగా వాటిల్లో 25,018 మంది సభ్యులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,367 చెరువులు, 3 పెద్ద రిజర్వాయర్లు, 6 మినీ రిజర్వాయర్లు ఉన్నాయి. ఈ సీజన్లో ఆయా వనరుల్లో 4.29 కోట్ల చేప పిల్లలు, 25 లక్షల రొయ్య పిల్లలను వదలాలని నిర్ణయించారు. గత నెల చివరి వారంలో టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఈ నెలలో చేపలను వదలాలని ప్రయత్నాలు ప్రారంభించారు.
సంగారెడ్డి జిల్లాలో...
జిల్లాలో మత్స్య సహకార సంఘాలు 219 ఉండగా వాటిలో మొత్తం 10,789 మంది సభ్యులు ఉన్నారు. జిల్లాలో మొత్తం చెరువులు 623, రెండు పెద్ద ప్రాజెక్ట్ లు సింగూరు, మంజీరా, రెండు చిన్న ప్రాజెక్టులు నల్లవాగు, నారింజ ఉన్నాయి. ఈ సీజన్ చేప విత్తన పిల్లల సరఫరా లక్ష్యం 3.62 కోట్లుగా నిర్ణయించారు. కాగా ఇప్పటి వరకు జిల్లాలో చేప పిల్లల పంపిణీ ఇంకామొదలు కాలేదు.
సొసైటీకి పైసలిస్తే కొనుక్కుంటం
చేప పిల్లలు ఇన్టైంలో పోయకపోవడంతో అవి సరిగ్గా పెరుగక నష్టమొ స్తది. ఎన్ని పిల్లలు సప్లై చేస్తారో, అన్నింటికి సరిపడా పైసలు డైరెక్ట్గా సొసైటీ బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి. అట్లయితే చెరువులు నిండగానే, సొసైటీ ఆధ్వర్యంలోనే చేప పిల్లలు కొనుక్కుని చెరువులో పోసుకుంటం.
చంద్రయ్య, మత్స్యకారుడు, నందగోకుల్ (మెదక్ జిల్లా)
సీడ్ తొందరగా సప్లై చేయాలి
గవర్నమెంట్ సొసైటీలకు ఫ్రీగా ఇచ్చే సీడ్ ను తొందరగా సప్లై చేయాలి. ఈ సారి జులై నెలలోనే పెద్ద వానలు పడి చెరువులన్నీ నిండినయి. తొందరగా సీడ్ పోస్తే చేపలు మంచి సైజు పెరుగుతయి. సీడ్ వేసుడు లేటైతే వెయిట్ తక్కువై మేము లాసైతం.
మంగిలిపల్లి రమేష్, మత్స్యకారుడు చల్మెడ (మెదక్ జిల్లా)