
హైదరాబాద్, వెలుగు : ఎన్నికల కోడ్ ముగియడంతో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర సర్కారు వేగంగా గ్రీన్సిగ్నల్ ఇస్తున్నది. అర్హత ఉన్న కంపెనీలకు భూముల కేటాయింపును వేగవంతం చేసింది. కంపెనీల ఏర్పాటు, పెట్టుబడులు పెట్టేందుకు 140 కంపెనీలు అప్లికేషన్లు పెట్టుకోగా ఇందులో 113 పరిశ్రమలు అర్హత సాధించాయని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన కార్పొరేషన్ (టీజీఐఐసీ) శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. గత 3 నెలలుగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున భూకేటాయింపులు చేయలేదని తెలిపింది.
కోడ్ ముగిసిన తర్వాత 113 కంపెనీలకు భూ కేటాయింపులు చేసినట్టు పేర్కొంది. వీటి ద్వారా రాష్ట్రానికి రూ. 2200 కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు దాదాపు 7వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు అందుతాయని అధికారులు పేర్కొన్నారు. భూమి కేటాయించిన కంపెనీల్లో ఫ్రాన్స్ కు చెందిన మానే, హాంకాంగ్కు చెందిన ఏపీసీ, మలబార్ గోల్డ్ వంటి మార్క్ ఇన్వెస్టర్లు ఉన్నట్టు తెలిపారు. ఈ భూ కేటాయింపుల్లో అగ్రభాగం ( 70 శాతం ) మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు.
టీజీఐఐసీ ప్రపంచస్థాయి పారిశ్రామిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దృష్టి కేంద్రికరించిందని తెలిపారు. అలాగే, స్థానిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేయూతను ఇవ్వడానికి , దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి మరిన్ని మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేయబోతున్నదని చెప్పారు. 2023 డిసెంబర్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు రూ. 50వేల కోట్ల కొత్త పెట్టుబడి ప్రపోజల్స్ అందాయని అధికారులు వెల్లడించారు. ఆయా సంస్థలకు భూమిని కేటాయించడానికి టీజీఐఐసీ ఈ కంపెనీలతో చర్చలు జరుపుతున్నదని తెలిపారు.