బనకచర్ల వివాదం..శ్రీశైలంలోని నిల్వ నీళ్లన్నీ తెలంగాణకే ఉండాలి

బనకచర్ల వివాదం..శ్రీశైలంలోని నిల్వ నీళ్లన్నీ తెలంగాణకే ఉండాలి

గోదావరి–బనకచర్ల (జీబీ) లింక్​ పేరుతో ఏపీ మరో కుట్రకు తెరలేపుతున్నది. పోలవరం నుంచి రోజూ 2 టీఎంసీల చొప్పున ఎత్తిపోసుకుని బనకచర్ల హెడ్​ రెగ్యులేటర్​కు తరలిస్తామని చెబుతున్న చంద్రబాబు సర్కారు..  ఆ సాకుతో పెన్నా బేసిన్​కు ఆయువుపట్టుగా ఉన్న బనకచర్ల హెడ్​ రెగ్యులేటర్​ సామర్థ్యాన్ని మరింత విస్తరించే కుట్ర పన్నుతున్నది. ఇందుకోసం 2005లో పోతిరెడ్డిపాడు విస్తరణ సమయంలోనే  బనకచర్ల విస్తరణకూ ఇచ్చిన జీవో 305 దుమ్ముదులుపుతున్నది. ఆ జీవోను అడ్డుపెట్టుకుని బనకచర్ల హెడ్​రెగ్యులేటర్​ కెపాసిటీని పెంచడంతోపాటు అక్కడి నుంచి ప్రారంభమయ్యే కెనాల్స్ విస్తరణ, లైనింగ్​ పనులకు రెడీ అవుతున్నది. 

ప్రస్తుతం 90 వేల క్యూసెక్కులే..

బనకచర్ల హెడ్​ రెగ్యులేటర్​తో ప్రస్తుతం 90 వేల క్యూసెక్కుల నీటినే మాత్రమే సీమవైపు తీసుకెళ్లే అవకాశం ఉంది. హెడ్​రెగ్యులేటర్​ కింద ఉన్న తెలుగుగంగ, కేసీ కెనాల్​, శ్రీశైలం రైట్ బ్రాంచ్​ కెనాల్, గాలేరు నగరి సుజల స్రవంతి కెనాల్​ సిస్టమ్స్ ద్వారా రోజుకు సుమారు 8 టీఎంసీల నీటిని తరలించవచ్చు. జీబీ లింక్​ ద్వారా బాబు తెస్తామంటున్న మరో 2 టీఎంసీలను రాయలసీమకు తరలించాలంటే ప్రస్తుతం ఉన్న కాల్వల ద్వారా సాధ్యం కాదు.

Also Read :- ఎస్ఆర్ బీసీ లైనింగ్ పనులతో తెలంగాణ నీటి వాటా దోపిడి

దీనికితోడు ఇప్పటికే 90 శాతం పనులు పూర్తిచేసుకున్న రాయలసీమ లిఫ్ట్ కోసం ప్రత్యేకంగా మరో కెనాల్​తవ్వి బనకచర్లకు తేనున్నారు. దీని  కెపాసిటీ 33 వేల క్యూసెక్కులు కాగా, రోజుకు 3 టీఎంసీలను తరలించవచ్చు. ఇలా ఏరకంగా చూసినా రోజుకు 20 లక్షల క్యూసెక్కులకు పైగా అంటే రోజుకు 18 టీఎంసీల నీటిని తరలించే మాస్టర్​ ప్లాన్​ను ఏపీ రెడీ చేస్తున్నట్టు నీటిపారుదల నిపుణులు చెప్తున్నారు.

శ్రీశైలంలోని నిల్వ నీళ్లన్నీ మనకే ఉండేలా!

వాస్తవానికి శ్రీశైలం స్పిల్​ వే  దూకుతున్న టైమ్​లో తాము నీళ్లు వాడుకుంటే ఇబ్బంది ఏముంటుందని ఏపీ వాదిస్తున్నది.  మరి అదే సమయంలో తెలంగాణ నీటి ప్రయోజనాలకు గండికొట్టేలా వ్యవహరిస్తున్నది. ఏపీ మిగులు జలాలను వాడుకుంటే..  వరదలు తగ్గాక శ్రీశైలం లో నిల్వ ఉండే  జలాలను  మొత్తం మనమే వాడుకునేలా ప్రతిపాదన ముందు పెట్టాలని తెలంగాణ సర్కారు భావిస్తున్నది. లైవ్​ స్టోరేజ్​లోని 165 టీఎంసీల  నీరు మనకే దక్కేలా ట్రిబ్యునల్​లో పోరాడాలని ఆలోచన చేస్తున్నది. ఇదే డిమాండ్​ను  ఏపీతో పాటు సీడబ్ల్యూసీ, కృష్ణా ట్రిబ్యునల్​ముందు పెట్టాలని ఇరిగేషన్​ఎక్స్​పర్ట్స్​ సూచిస్తున్నారు. అప్పుడే ఏపీ చేస్తున్న వితండవాదానికి అడ్డుకట్ట పడ్తుందని, తెలంగాణ తన వాటా జలాలను వినియోగించుకునే అవకాశమూ ఏర్పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.