- పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
- ఈ నెల 3 నుంచి పరీక్షలు ప్రారంభం
వనపర్తి, వెలుగు: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రాక్టికల్ పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత కొన్నేండ్లుగా ల్యాబ్లలో రసాయనాలు, సామగ్రి లేక రెగ్యులర్గా ప్రయోగాలు చేయక పరీక్షల ముందు ఉన్నవాటితో కానిచ్చేవారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ప్రతి జూనియర్ కాలేజీకి ప్రయోగాలు చేసేందుకు రూ.25 వేల చొప్పున మంజూరు చేసింది. సీసీ కెమెరాల మధ్య పరీక్షలు నిర్వహించాలని గతంలో ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ, ఒకటి రెండు కెమెరాలను ఉపయోగించేవారు. ఈసారి అలా కాకుండా అడిషనల్ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేసింది.
ఉమ్మడి జిల్లాలో 118 కెమెరాలు..
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి జూనియర్ కాలేజీకి అడిషనల్ గా సీసీ కెమెరాలను అందిస్తూ ఒక్కో కాలేజీకి రూ.12 వేల చొప్పున ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 59 కాలేజీలకు రూ.7.08 లక్షల నిధులు మంజూరు చేసింది. ఫిబ్రవరి 3 నుంచి నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగనుండగా, ఇప్పటికే సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, కేజీబీవీలు, గురుకులాలతో కలిపి 141 ఉన్నాయి. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, ఒకేషనల్ స్టూడెంట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్ చేస్తారు. థియరీ ఎగ్జామ్స్తో పాటు ప్రాక్టికల్ పరీక్షల మార్కులు కలిసి స్కోరు పెరిగే అవకాశం ఉంటుంది.
కాబట్టి ప్రాక్టికల్స్కు సైతం స్టూడెంట్స్ ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఎగ్జామ్స్ ముందు కెమికల్స్కు నిధులు మంజూరు చేయడంపై స్టూడెంట్స్ పెదవి విరుస్తున్నారు. తక్కువ సమయంలో ప్రాక్టికల్స్ ఎలా స్కోర్ చేయగలుగుతామని అంటున్నారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఫలితాల మీద దృష్టి కేంద్రీకరించి మార్కులు స్కోర్ చేసేందుకు ప్రయత్నిస్తాయి. అలా ప్రాక్టికల్ పరీక్షల్లో ప్రైవేట్ సెంటర్కు ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ను నియమిస్తారు. ప్రతి ఏడాది ప్రైవేట్ మేనేజ్మెంటు కోరుకున్న వారికి ఎగ్జామ్ డ్యూటీ వేస్తూ రావడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది డీవోల కేటాయింపులో డీఐఈవో పారదర్శకంగా వ్యవహరించాలని మెజారిటీ స్టూడెంట్లు కోరుతున్నారు.
జిల్లాల వారీగా..
నాగర్కర్నూల్ జిల్లాలో 16 కాలేజీలుండగా, 32 కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. మహబూబ్నగర్లో 15 కాలేజీలకు 30, వనపర్తిలో 12 కాలేజీలకు 24, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 8 కాలేజీల చొప్పున ఉండగా, 16 చొప్పున సీసీ కెమెరాలను అమర్చనున్నారు. దీంతో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పారదర్శకంగా జరిగేందుకు ఆస్కారం ఏర్పడనుంంది. ఉమ్మడి పాలమూరుజిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, కేజీబీవీలు, గురుకులాలు, వొకేషనల్ కాలేజీలు 261 ఉన్నాయి. వీటిలో చదివే సైన్స్ స్టూడెంట్లు 19,767 మంది ప్రాక్టికల్ ఎగ్జామ్స్కు హాజరు కానున్నారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం..
ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తాం. ఈసారి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. గత పరీక్షలు జరిగిన తీరును దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేశాం.
- ఎర్ర అంజయ్య, డీఐఈవో, వనపర్తి
జిల్లాల వారీగా వివరాలు..
జిల్లా కాలేజీలు స్టూడెంట్లు
మహబూబ్నగర్ 48 8,392
వనపర్తి 41 6,591
నాగర్కర్నూల్ 40 6,250
నారాయణపేట 30 2,359
జోగులాంబ గద్వాల 26 2,230