
హైదరాబాద్: ఆర్టీసీ అద్దె బస్సులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం(మార్చి 4, 2025) ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడతలో 150 మహిళా సంఘాలకు బస్సులు కేటాయిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలో మిగిలిన సంఘాలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
బస్సుల కొనుగోలుకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది. టీజీఎస్ఆర్టీసీ ఒక్కో బస్సుకు 77,220 రూపాయల అద్దె చెల్లించనుంది. మన దేశంలోనే తొలిసారి మహిళా సంఘాలకు అద్దె RTC బస్సులు కేటాయించడం గమనార్హం. తొలి విడతలో ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించనున్నారు.
Also Read:-ఉత్కంఠగా కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్..
సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత జిల్లా కరీంనగర్లను ఎంపిక చేశారు. మొదటి విడతలో 150 బస్సులను మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి నిర్వహణ బాధ్యతల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు అయ్యే ఖర్చు, వచ్చే ఆదాయం, నిర్వహణ ఖర్చు తదితర అంశాలన్నింటితో కూడిన సమగ్ర నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అధికారులు సమర్పించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ ఉంది. ఈ క్రమంలో మహిళా సంఘాలకు ఉపాధి కల్పించడంతోపాటు వారు కొనుగోలు చేసిన బస్సులను హైర్ చేసుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది.