
- 2.5 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణం.. డీపీఆర్లు రెడీ చేయాలి
- ప్రత్యేకంగా మూడు ఐలాండ్ ప్రాంతాలు అభివృద్ధి
- మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి
- అధికారులకు సీఎం ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: మీరాలం ట్యాంక్పై రెండున్నర కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జిని నిర్మించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాపూఘాట్లో నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్ తో పాటు మీరాలం ట్యాంక్ పై నిర్మించనున్న బ్రిడ్జి నమూనాలను ఆయన పరిశీలించారు. మీరాలం ట్యాంక్పై బ్రిడ్జి నిర్మాణ పనులకు జూన్లో టెండర్లు పిలవాలని సూచించారు. ఈలోగా అందుకు అవసరమైన సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో డీపీఆర్ ను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. మూసీ పునరుజ్జీవంపై శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలన్నారు. మీరాలం ట్యాంక్పై నిర్మించే బ్రిడ్జికి సంబంధించి కన్సెల్టెన్సీలు తయారుచేసిన నమూనా డిజైన్లను అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రెండున్నర కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించాలని, అదే సమయంలో సందర్శకులు, ప్రయాణికుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఉండే డిజైన్లను ఎంచుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు.
బ్రిడ్జితో పాటు మీరాలం ట్యాంక్లో వివిధ చోట్ల ఐలాండ్స్ ఉన్న మూడు ప్రాంతాలను పర్యాటకులను ఆకట్టుకునేలా అందంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ అన్నారు. సింగపూర్లోని గార్డెన్స్ బై ది బే ను తలపించేలా బర్డ్స్ పారడైజ్, వాటర్ ఫాల్స్ లాంటివి ఉండేలా ఈ మూడు ఐలాండ్లను అభివృద్ధి చేయాలన్నారు. వెడ్డింగ్ డెస్టినేషన్ కు వీలుగా ఉండే కన్వెన్షన్ సెంటర్లతో పాటు అడ్వెంచర్ పార్క్, థీమ్ పార్క్, అంఫీ థియేటర్ను ఏర్పాటు చేసేందుకు వీలుగా డిజైన్లు ఉండాలన్నారు. బోటింగ్తో పాటు పర్యాటకులు విడిది చేసేలా రిసార్ట్స్, హోటల్స్ అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. ట్యాంక్లో నీటిని శుద్ధి చేయటంతో పాటు ఐలాండ్స్ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని ప్రతిపాదనలతో డీపీఆర్ రెడీ చేయా లన్నారు.
పీపీపీ మోడల్లో ఈ ఐలాండ్స్ జోన్ను అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు చెప్పారు. మీరాలం ట్యాంక్లో నీటి లభ్యతను, వరద వచ్చినప్పుడు ఉండే నీటి ప్రవాహ తీవ్ర తను ముందుగానే అంచనా వేసుకొని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుచూపుతో డిజైన్లు చేసుకోవాలన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన హైడ్రాలజీతో పాటు పర్యావరణానికి సంబంధించి నిపుణులు, లేదా ఆ రంగంలో పేరొందిన సంస్థలతో సర్వే చేయించాలని, ఆ నివేదికల ఆధారంగా అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని సీఎం సూచించారు. మీరాలం బ్రిడ్జితో పాటు ఈ ఐలాండ్ జోన్ను పక్కనే ఉన్న జూపార్కుకు అనుసంధానం చేయాలన్నారు. ఇక్కడి డెవలప్మెంట్ ప్లాన్ను దృష్టిలో పెట్టుకొని జూ పార్కును అప్ గ్రేడ్ చేయాలని ఆయన ఆదేశించారు. జూ అధికారులతో సంప్రదింపులు జరిపి, నిబంధనల ప్రకారం అప్ గ్రేడ్ చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలన్నారు. పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా అభివృద్ధి ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులకు సీఎం సూచించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి పాల్గొన్నారు.