
- జీపీఓలకు ఇప్పటికే 6 వేల మంది పాత వీఆర్వో, వీఆర్ఏల ఆప్షన్స్
- మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నింపే చాన్స్
- గ్రామాల్లో ఇక రెవెన్యూ సేవలు !
హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వీరిని గ్రామ పాలన ఆఫీసర్ (జీపీవో)గా పిలవనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వీఆర్వోలు, వీఆర్ఏలుగా పనిచేసిన వారి నుంచి ఆప్షన్ తీసుకొని వారిని ‘‘గ్రామ పాలన అధికారి’’గా నియమించనున్నారు. ఇందుకు సంబంధించిన తదుపరి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖను ఆర్థిక శాఖ కోరింది. ఇప్పటికే ఇతర శాఖల్లో వీలినమైన వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి రెవెన్యూ శాఖ ఆప్షన్స్ తీసుకున్నది. ఇందులో 7 వేల లోపే జీపీవోలుగా చేసేందుకు ముందుకు వచ్చారు.
వీరందరికీ ఒక పరీక్ష నిర్వహించి, వారి నైపుణ్యాలను అంచనా వేశాకే.. జీపీవోలుగా నియమించనున్నారు. వీళ్ల ద్వారా దాదాపు 6 వేల వరకు పోస్టులు భర్తీ అవుతాయని తెలిసింది. ఇక మిగిలిన పోస్టులను డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ద్వారా తీసుకోనున్నట్టు సెక్రటేరియేట్వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా మార్చి 6న సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలన అధికారులను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడంతోపాటు వీఆర్వో, వీఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసింది. ఫలితంగా క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ కుంటుపడింది. దీంతో మళ్లీ గ్రామ పాలన అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఎక్కువ మంది ఆసక్తి చూప్తలే..
గత సర్కారు హయంలో వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థపై ఎక్కువగా అవినీతి ఆరోపణలు వచ్చాయి. పై అధికారులు వసూళ్ల కోసం తమను వాడుకున్నారని, చివరికి తాము బద్నాం అయ్యామనే భావన చాలా మంది వీఆర్వోలు, వీఆర్ఏల్లో ఉన్నది. మరోసారి గ్రామస్థాయి అధికారులుగా వెళ్తే అదే సమస్య వస్తుందని చాలా మంది భావిస్తున్నారు. అలాగే, జీపీవోలుగా పనిచేస్తే పెద్దగా ప్రమోషన్లు రావని ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఎగ్జామ్ పెట్టి తీసుకోవాలని నిర్ణయించడంతో చాలామంది వెనుకడుగు వేస్తున్నట్టు తెలిసింది. నాటి ప్రభుత్వం 2020 అక్టోబర్ లో దాదాపు 22 వేలకు పైగా వీఆర్వో, వీఆర్ఏలను 37 శాఖల్లోని వివిధ పోస్టుల్లో సర్దుబాటు చేసింది. దీంతో ఇప్పటికే వీరంతా ఆయా శాఖల్లో సెట్అయ్యారు. జాబ్చార్ట్ కూడా పరిమితంగా ఉండడంతో ఉన్న శాఖల్లోనే కంటిన్యూ కావాలని ఎక్కువ మంది వీఆర్వోలు భావిస్తున్నారు. కొన్ని శాఖల్లో సీనియర్ అసిస్టెంట్లుగా, సూపరింటెండెంట్లుగా కూడా కొందరు వెళ్లారు. దీంతో ఆయా పోస్టుల్లో సీనియారిటీ, ప్రమోషన్లను దృష్టిలో ఉంచుకొని, తిరిగి గ్రామ పాలనాధికారిగా వచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదని తెలుస్తున్నది.
జాబ్ చార్ట్ రెడీ..
అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలకు క్షేత్రస్థాయిలో అవసరమైన ఎంక్వైరీని గ్రామ పాలన ఆఫీసర్లతోనే చేయించేలా జాబ్ చార్ట్ను ప్రభుత్వం తయారు చేస్తున్నది. కొత్తగా వచ్చిన భూ భారతి చట్టం ప్రకారం రెవెన్యూ రికార్డులను మాన్యువల్గా వీరితోనే నిర్వహించనున్నది. 12 కాలమ్ ల నుంచి 14 కాలమ్లు మాన్యువల్ రికార్డ్స్లలో పెట్టనున్నట్టు తెలిసింది. దీంతోపాటు గ్రామానికొక అధికారి ఉంటే క్యాస్ట్, ఇన్కం వంటి సర్టిఫికెట్లతోపాటు పంచనామా, భూముల రికార్డులు, ప్రభుత్వ భూములు, చెరువులు, నీటి వనరుల పరిరక్షణ సహా భూ సంబంధిత వ్యవహారాల్లో క్షేత్రస్థాయి విచారణ కొత్తగా నియమించనున్న అధికారులకు అప్పగించనున్నది. ల్యాండ్ సర్వే రిలేటెడ్ వర్క్స్లో అసిస్టెన్స్ చేయడం, వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపు, భూ సర్వేకు సహాయకారిగా ఉండడం, విపత్తులు, ఇతర అత్యవసర సేవల్లో తోడ్పాటు అందించడం వంటి బాధ్యతలతోపాటు సాధారణ పరిపాలన శాఖ ఏమైనా డ్యూటీలు అసిస్టెన్స్ చేసేలా డ్యూటీ చార్ట్ రూపొందిస్తున్నారు.