జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తం : మంత్రి దామోదర

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తం : మంత్రి దామోదర
  •  హెల్త్ కార్డులపై త్వరలో సమీక్ష చేపడ్తం: మంత్రి దామోదర

హైదరాబాద్, వెలుగు: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. హెల్త్ కార్డుల  విషయంలో త్వరలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులతో సమీక్ష చేస్తానని ప్రకటించారు. ప్రజలు, జర్నలిస్టుల ఆరోగ్యం విషయంలో రాజీపడేది లేదన్నారు. అందుకే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్టు వివరించారు. శుక్రవారం హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో ఉన్న మంత్రుల నివాస సముదాయంలో మంత్రిని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) ప్రతినిధి బృందం కలిసింది.

ఈ సందర్భంగా హెల్త్ కార్డులు దీర్ఘకాలికంగా సరిగా పనిచేయడం లేదని మంత్రి దృష్టికి తెచ్చారు.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నా, ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానలు పట్టించుకోవడం లేదని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం రూపొందిస్తున్న కొత్త ఆరోగ్య పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయాలని కోరారు. ఉద్యోగుల నుంచి వసూలు చేసే ఒక శాతం కంట్రిబ్యూషన్.. జర్నలిస్టులకు సంబంధించి ప్రభుత్వమే భరించాలని విజ్ఞప్తి చేశారు.

 ఇందుకు స్పందించిన మంత్రి ఈ విషయాన్ని పరిశీలిస్తామని ఫెడరేషన్ నాయకత్వానికి హామీ ఇచ్చారు. త్వరలో ఆరోగ్యశ్రీ అధికారులతో జర్నలిస్టుల విషయమై సమీక్ష చేసి, నిర్ణయాలు తీసుకుంటామన్నారు. మంత్రిని కలిసిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవ పున్నయ్య, ఉపాధ్యక్షుడు గుడిగ రఘు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పి. విజయ, హెచ్​యూజే అధ్యక్షులు బి. అరుణ్ కుమార్, బి. జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

దామోదరకు కృతజ్ఞతలు తెలిపిన 57 ఎంబీఎస్సీ కులాల ప్రతినిధులు

ఎస్సీ వర్గీకరణ తీర్మానానికి కృషిచేసిన మంత్రి దామోదర రాజనర్సింహకు 57 ఎంబీఎస్సీ కులాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ చేసిన కృషిని డక్కలి కళాకారుడు పోచప్ప పాటగా మలచి మంత్రికి వినిపించారు. ఈ సందర్భంగా డక్కలి పోచప్పకు చెందిన12 మెట్ల కిన్నెరను మంత్రి పరిశీలించారు.

 పోచప్ప అభ్యర్థన మేరకు కిన్నెరను మంత్రి దామోదర్ రాజనర్సింహ వాయించి అందరిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం, బత్తుల పాండు, ఉపాదే సనాదన్, కోల్పుల నవీన్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.