
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నమోదైన రెండు వేర్వేరు కేసులను హైకోర్టు కొట్టివేసింది. మేడిగడ్డపై డ్రోన్ ఎగురవేశారంటూ గతేడాది జులై 29న తమపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్తోపాటు బీఆర్ఎస్ నేతలు గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్కసుమన్లు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ కె.లక్ష్మణ్ విచారించి, సోమవారం తీర్పు వెలువరించారు. ఏయిర్ క్రాఫ్ట్ చట్టం కింద.. మేడిగడ్డను నిషేధిత ప్రాంతంగా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయలేదని కోర్టు తెలిపింది. ఈ ఉల్లంఘనకు సంబంధించి కేంద్రమే జరిమానా విధించాల్సి ఉందని వెల్లడించింది. కేసు నమోదుకు చేసిన జాప్యానికి సరైన కారణం పేర్కొనలేదని వివరించింది. సుప్రీం కోర్టు వెలువరించిన పలు తీర్పుల నేపథ్యంలో మహదేవపురం పోలీసు స్టేషన్లో నమోదైన కేసును కొనసాగించలేమని..దాన్ని కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలువరించింది.
ఉట్నూరు కేసు కూడా..
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశారంటూ కేటీఆర్ పై ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో నమోదైన కేసును కూడా హైకోర్టు కొట్టివేసింది. మూసీ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ పార్టీ రూ.25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు. దాంతో తమ పార్టీ ప్రతిష్టను కేటీఆర్ దెబ్బతీశారంటూ కాంగ్రెస్ కు చెందిన ఆత్రం సుగుణ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఉట్నూరు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టి ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాల్లేవంటూ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.