
బీఆర్ఎస్ వరంగల్ సభ అనుమతిపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వరంగల్ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై ఏప్రిల్ 11న హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ సందర్బంగా బీఆర్ఎస్ సభ అనుమతిపై పరిశీలిస్తున్నామని .. వారం రోజుల్లో సభ అనుమతి పై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఏప్రిల్ 17 లోపు సభ అనుమతి పై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది హైకోర్టు. ఈ మేరకు వరంగల్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది . అనంతరం తదుపరి విచారణ ఏప్రిల్ 17 కి వాయిదా వేసింది కోర్టు.
25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27 న హనుమకొండలోని ఎల్క తుర్తిలో సిల్వర్ జూబ్లీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు సభ నిర్వహిస్తామని బీఆర్ఎస్ తెలిపింది. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు.. సభ అనుమతిపై వారం రోజుల్లో తేల్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకులపై మాజీ సీఎం కేసీఆర్ జిల్లాల వారీగా భేటీ అయ్యారు. భారీగా జనసమీకరణ చేసి సభను విజయవంతం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.