
- మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య ఎలక్షన్లపై వివరణ ఇవ్వండి
హైదరాబాద్, వెలుగు: జిల్లా మత్స్యసహకార సంఘాలతోపాటు మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ ఎన్నిక నిర్వహించకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ను నామినేట్ చేయాలన్న ప్రతిపాదనపై వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఎక్కువ సంఖ్యలో ఉన్న తమ వర్గానికి చెందిన వ్యక్తిని కాకుండా బెస్త వర్గానికి చెందిన వ్యక్తిని నామినేట్ చేయడంపై తాము చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ హనుమకొండకు చెందిన బుస్సా మల్లేశం మరో 8 మంది హైకోర్టులో పిటిషన్ వేశారు.. దీనిపై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది డి.ఎల్.పాండు వాదనలు వినిపించారు. తర్వాత న్యాయమూర్తి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు.