తెలుగు, ఇంగ్లీష్​ భాషల్లో పరీక్ష పెట్టండి .. గురుకుల రిక్రూట్​మెంట్​ బోర్డును ఆదేశించిన హైకోర్టు

తెలుగు, ఇంగ్లీష్​ భాషల్లో పరీక్ష పెట్టండి .. గురుకుల రిక్రూట్​మెంట్​ బోర్డును ఆదేశించిన హైకోర్టు
  • ఆర్ట్‌‌, క్రాఫ్ట్‌‌ పోస్టుల నియామకాలు నోటిఫికేషన్​లో పేర్కొన్న విధంగా చేపట్టాలి

హైదరాబాద్, వెలుగు: గురుకుల విద్యా సంస్థల్లో ఆర్ట్‌‌ అండ్​ క్రాఫ్ట్, మ్యూజిక్‌‌ టీచర్‌‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌లో పేర్కొన్నట్టుగానే తెలుగు, ఇంగ్లీష్ ​భాషల్లో పరీక్షలు నిర్వహించాలని గురుకుల నియామక బోర్డును హైకోర్టు ఆదేశించింది. నోటిఫికేషన్లలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోరాదని స్పష్టం చేసింది. ఆర్ట్‌‌ అండ్​ క్రాఫ్ట్ టీచర్‌‌ పోస్టులకు రెండు భాషల్లో పరీక్షలు నిర్వహించాలని గతంలో సింగిల్‌‌ జడ్జి జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యానికి డివిజన్‌‌ బెంచ్‌‌ నిరాకరించింది.

 ఈ మేరకు జస్టిస్‌‌ అభినందకుమార్‌‌ షావిలి, జస్టిస్‌‌ లక్ష్మినారాయణ అలిశెట్టితో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ తీర్పు వెలువరించింది. గురుకుల విద్యా సంస్థల్లో పలు పోస్టుల భర్తీకి 2023లో వెలువరించిన నోటిఫికేషన్‌‌ మేరకు ఆ ఏడాది ఆగస్టు 1న పరీక్షలు నిర్వహించింది. ఆర్ట్ అండ్​ క్రాఫ్ట్, మ్యూజిక్‌‌ టీచర్‌‌ పోస్టులకు ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లిష్​లో ఉంటుందని నోటిఫికేషన్‌‌లో ఉందని, అయితే కేవలం ఇంగ్లిష్​లో మాత్రమే పరీక్ష నిర్వహించారంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సింగిల్‌‌ జడ్జి.. క్రాఫ్ట్‌‌ టీచర్‌‌ పోస్టుల నియామకం తుది తీర్పునకు లోబడి ఉంటుందని, ఆర్ట్‌‌ టీచర్‌‌ పోస్టులకు సంబంధించి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. 

ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ గురుకుల నియామక బోర్డు దాఖలు చేసిన అప్పీళ్లను డివిజన్​ బెంచ్​విచారించింది. పరీక్షను తిరిగి నిర్వహిస్తే దాని ప్రభావం ఇప్పటికే పరీక్ష రాసిన 4,359 మందిపై పడుతుందని, నియామకాలు ఆలస్యం అవుతాయని, అప్పీళ్లను కొట్టేయాలని గురుకుల నియామక బోర్డు చేసిన వాదనను తోసిపుచ్చింది. నోటిఫికేషన్​లో పేర్కొన్న నిబంధనలను అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆర్డ్​ అండ్​ క్రాఫ్ట్‌‌ టీచర్‌‌ పోస్టులకు నోటిఫికేషన్​లో పేర్కొన్న నిబంధనల ప్రకారం తెలుగు, ఇంగ్లిష్​భాషల్లో పరీక్షలు నిర్వహించాలని తీర్పు వెలువరించింది.