
- కేసు నమోదుకు సరైన కారణాల్లేవన్న హైకోర్టు
- కేసును కొనసాగిస్తే న్యాయ ప్రక్రియ దుర్వినియోగమేనని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్ రావుపై నమోదైన ఫోన్ట్యాపింగ్ కేసును హైకోర్టు కొట్టివేసింది. సరైన కారణాలు లేకుండా కేసు నమోదు చేశారని, ఈ కేసును కొనసాగిస్తే న్యాయప్రక్రియను దుర్వినియోగం చేసినట్లవుతుందని గురువారం హైకోర్టు తేల్చి చెప్పింది. తన ఫోన్ను ట్యాప్చేస్తున్నారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు హరీశ్రావుతో పాటు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పై కేసు నమోదు చేశారు.
ఆ కేసు కొట్టివేయాలంటూ హరీశ్రావు, రాధాకిషన్ రావు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లను విచారించిన జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం 36 పేజీల తీర్పును వెలువరించారు. చక్రధర్గౌడ్ సెప్టెంబరు 1న పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో దోపిడీకి పాల్పడినట్లు గానీ, విశ్వాసఘాతుకానికి పాల్పడినట్లు, నేరపూరిత బెదిరింపులకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు చేయలేదని తీర్పులో పేర్కొన్నారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 66 నమోదు చేసినప్పటికీ దానికి తగ్గ కారణాలను వెల్లడించలేదన్నారు.
ఆరోపణలన్నీ కేవలం ఫోన్ట్యాపింగ్కు సంబంధించి తప్ప మిగిలిన ఆరోపణల ప్రస్తావన లేదన్నారు. అలాంటప్పుడు ఐపీసీ సెక్షన్ 386 కింద ఎఫ్ఐర్ నమోదు చేయడానికి అనుమతించలేమని, దాన్ని కొట్టివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫోన్ట్యాపింగ్ కేసులో అరెస్టయిన రాధాకిషన్రావు 2023 ఆగస్టు నుంచి ఈ ఏడాది జనవరి 30 దాకా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని, దర్యాప్తు పూర్తయి అభియోగ పత్రం కూడా దాఖలైందని, ఇదే కేసులో 60వ సాక్షిగా చక్రధర్గౌడ్ వాంగ్మూలాన్ని నమోదు చేశారన్నారు. వాంగ్మూలంలోని అంశాలతోనే పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు.
చక్రధర్గౌడ్ను పలు కేసుల్లో అరెస్ట్ చేసి వేధించినట్లు చెప్తున్నారని.. అయితే, అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు రాధాకిషన్రావుపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న విషయం గమనించాలన్నారు. ఈ నేపథ్యంలో ఐపీసీ 386, 409, 506లతోపాటు ఐటీ చట్టం సెక్షన్ 66 కింద కేసును కొనసాగించడానికి ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. ఇలాంటి సమయంలో సెక్షన్ 482 కింద కేసును కొట్టివేసే అధికారం హైకోర్టుకు ఉందంటూ భజన్లాల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందన్నారు.
జాప్యానికి కారణాల్లేవు
హరీశ్ రావు, రాధాకిషన్ రావులపై ఫిర్యాదు చేయడంలో తీవ్రమైన జాప్యం జరగడానికి ఎలాంటి కారణాలను ఫిర్యాదుదారు పేర్కొనలేదని జడ్జి పేర్కొన్నారు. 2023లో సివిల్ దుస్తుల్లో పోలీసులు తీసుకెళ్లడం, అదే ఏడాది ఆపిల్ ఫోన్ నుంచి మెసేజ్ వచ్చినా 2024 డీజీపీకి వినతి పత్రం ఇచ్చి, అదే ఏడాది డిసెంబరులో పోలీసులకు ఫిర్యాదు చేశారని, సంఘటనలన్నీ 2023లో జరిగినా.. 2024 డిసెంబరు వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదనడానికి కారణాలు చెప్పలేదన్నారు.
హరీశ్రావు మంత్రిగా ఉండడం, రాధాకిషన్ రావు ఆయనకు సన్నిహితుడిగా ఉండడంతో భయంతో ఫిర్యాదు చేయలేదన్నది వాస్తవం అయితే.. 2023 డిసెంబరులో ప్రభుత్వం మారినపుడు చేసి ఉండవచ్చన్నారు. ఫిర్యాదుదారు.. హరీశ్ రావుపై ఎన్నికల్లో పోటీ చేశారని.. ఈనేపథ్యంలో రాజకీయ శత్రుత్వం కూడా ఫిర్యాదుకు కారణమన్నారు.