ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా?..హైడ్రాపై హైకోర్ట్ ఫైర్

ఎన్నిసార్లు చెప్పినా  మీరు మారరా?..హైడ్రాపై హైకోర్ట్ ఫైర్

హైదరాబాద్‌‌, వెలుగు: హైడ్రాపై హైకోర్టు మరోసారి మండిపడింది. ‘ఎన్నిసార్లు చెప్పినా.. మీరు మారరా?’ అంటూ ఫైర్ అయింది. అక్రమ నిర్మాణమంటూ శుక్రవారం నోటీసులిచ్చి, వివరణ ఇచ్చేందుకు శనివారం ఒక్కరోజే సమయమిచ్చి, ఆదివారం కూల్చివేతలు చేపట్టాల్సినంత తొందరేముంది? అని ప్రశ్నించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌మెట్‌‌ మండలం కోహెడ గ్రామంలోని ఆస్తుల కూల్చివేతను సవాల్‌‌ చేస్తూ సామ్రెడ్డి బాలారెడ్డి ఆదివారం హైకోర్టులో హౌస్ మోషన్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేశారు. హైడ్రా నోటీసులు చట్ట విరుద్ధమని, వాటిని రద్దు చేస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘‘అక్రమ నిర్మాణమంటూ అధికారులు శుక్రవారం పిటిషనర్ కు నోటీసులు ఇచ్చారు. 

వ్యక్తిగతంగా హాజరుకావాలని శనివారం సమయం ఇచ్చారు. ఆ వెంటనే ఆదివారం కూల్చివేతలు చేపట్టారు. టైటిల్‌‌ లింక్‌‌ పత్రాలు, పట్టాదార్‌‌ పాస్‌‌బుక్, ఇతర అన్ని డాక్యుమెంట్లతో రావాలని ఆదేశించిన అధికారులు.. ఒక్క రోజే సమయం ఇచ్చారు. అధికారుల తీరు చట్టవిరుద్ధం. నోటీసులను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాలి’’ అని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలు చేపట్టే ముందు సహేతుకమైన సమయం ఇవ్వాలన్నారు. పిటిషనర్‌‌కు న్యాయమైన అవకాశం ఇవ్వకుండా తదుపరి చర్యలు తీసుకోవద్దని హైడ్రాను ఆదేశించారు. అవసరమైన పత్రాలను సమర్పించడానికి పిటిషనర్‌‌కు ఒక వారం సమయం ఇచ్చారు. వాటిని పరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హైడ్రాను ఆదేశించారు. అలాగే నోటీసులు జారీ, విచారణ, కూల్చివేతలు.. స్వల్పకాలంలో చేపట్టేలా నిర్ణయాలు తీసుకోవద్దని తేల్చిచెప్పారు. ముఖ్యంగా సెలవు దినాల్లో కూల్చివేతలు చేపట్టవద్దని, అయినా చేపడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.