
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఏప్రిల్ 8న తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పేలుళ్లకు పాల్పడ్డ ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది. 2016 లో నిందితులకు ఉరిశిక్ష విధించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్ధించింది.
జంట పేలుళ్ల కేసులో అయిదుగురు నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ పరారీలో ఉండగా, మిగిలిన అసదుల్లా అక్తర్ అలియాస్ హద్ది, జియా ఉర్ రహమాన్ అలియాస్ వఘాస్, మహమ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్, మహమ్మద్ అహ్మద్ సిద్ధిబప అలియాస్ యాసిన్ భత్కల్, అజాజ్ షేక్ అలియాస్ సమర్ ఆర్మాన్ తుండె అయిదుగురికి ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే NIA కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. వాదనల అనంతరం ఏప్రిల్ 8న నిందితుల పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు.. ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్ష సరైనదేనంటూ తీర్పునిచ్చింది .
2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ బస్టాండ్ సమీపంలో కొద్ది నిమిషాల గ్యాప్లోనే రెండు పేలుళ్లు జరిగాయి. మొదట బస్టాండ్ ఎదురుగా ఒక బాంబ్ పేలిన కొద్దిసేపటికే.. 150 మీటర్ల దూరంలోనే మరో బ్లాస్ట్ సంభవించింది. టిఫిన్ బాక్సులో బాంబు పెట్టి.. టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. పేలుళ్ల ధాటికి 17 మంది మరణించగా, దాదాపు 130 మందికిపైగా గాయపడ్డారు.బ్లాస్ట్ కేసును NIA దర్యాప్తు చేసింది.
ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్ (యూపీ), జియా-ఉర్-రెహమాన్ (పాకిస్థాన్), తెహసీన్ అక్తర్ (బీహార్), అజాజ్ షేక్ (మహారాష్ట్ర) కలిసి ఈ దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.