- నిర్వాసితుల్లో వితంతువులు ఉంటే కుటుంబంగా పరిగణించాలి
- మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల కేసులో హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ఏదైనా ప్రాజెక్టు కోసం భూసేకరణ చేపడితే.. నిర్వాసితుల్లో వితంతువులు ఉంటే వాళ్లను వేరే కుటుంబంగా పరిగణించి పరిహారం ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్లో కొమురవెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిమిత్తం ప్రారంభించిన భూసేకరణతో ఇండ్లు కోల్పోయిన వితంతువులను ప్రత్యేక కుటుంబంగా పరిగణించి పునరావాస, పునర్నిర్మాణ పథకం కింద పరిహారం చెల్లించాలని చెప్పింది.
బాధితులు సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి 4 నెలల్లోగా ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని జస్టిస్ కె.లక్ష్మణ్ ఇటీవల తీర్పు చెప్పారు. కొమురవెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిమిత్తం వేములఘాట్ గ్రామ పరిసరాల్లో 2016–19 మధ్యకాలంలో సుమారు 2,500 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గ్రామం మొత్తం ముంపునకు గురవుతున్నప్పటికీ అధికారులు పునరావాసం, పునర్నిర్మాణ పథకం కింద పరిహారం చెల్లించలేదంటూ చీర్ల గంగవ్వ సహా 36 మంది బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.