
తెలంగాణ జాబ్ స్పెషల్ కరెంట్ ఎఫైర్స్
ఇంటర్నేషనల్
అమెరికా నేవీకి మహిళా అధిపతి
మహిళా అధికారి అడ్మిరల్ లీసా ఫ్రాంచెటీని అమెరికా నౌకాదళాధిపతిగా ఎంపిక చేస్తూ అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా మిలటరీ సర్వీసు చీఫ్గా ఒక మహిళ నియమితులు కావడం ఇదే మొదటిసారి అవుతుంది.
వియత్నాంకు ఐఎన్ఎస్ కృపాణ్ యుద్ధనౌక
భారత నౌకాదళానికి 32 ఏళ్లుగా సేవలందించిన ‘ఐఎన్ఎస్ కృపాణ్’ యుద్ధనౌకను వియత్నాంకి గిఫ్ట్గా భారతదేశం అందజేసింది. భారత నౌకాదళం అధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ ఈ యుద్ధనౌకను ‘వియత్నాం పీపుల్స్ నేవీ’కి అప్పగించారు.
ట్విటర్కు కొత్త లోగో
ట్విటర్ లోగో అయిన బ్లూ పక్షి స్థానంలో, నలుపు రంగు బ్యాక్గ్రౌండ్లో తెలుపు రంగు ‘ఎక్స్’ గుర్తుతో కొత్త లోగోను సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ ఆవిష్కరించారు. ఈ డిజైన్ను శాన్ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయంపై ప్రొజెక్ట్ చేశారు.
ఫెడ్ వడ్డీ రేటు 0.25% పెంపు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును మరో 0.25 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో రుణ రేటు 5.25-–5.50 శాతానికి పెరిగింది.
కంబోడియా ప్రధానిగా హన్మానెట్
కంబోడియా ఎన్నికల్లో విజయం సాధించిన కంబోడియన్ పీపుల్స్ పార్టీ హన్మానెట్ను భావి ప్రధానమంత్రిగా ఎంపిక చేయించారు. దశాబ్దాలుగా దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలిస్తున్న పీపుల్స్ పార్టీకి తాజా ఎన్నికల్లో 17 ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీ ఎదురైంది.
వ్యక్తులు
మీలా జయదేవ్
ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా మీలా జయదేవ్ ఎన్నికయ్యారు. రెండేళ్ల పాటు ఆయన ఈ హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తారు. మీలా జయదేవ్ రాష్ట్రంలోని ప్రముఖ వ్యాపార సంస్థల్లో ఒకటైన సుధాకర్ గ్రూపు సంస్థల యజమానిగా ఉన్నారు.
మాధవరావు
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) నూతన చైర్మన్, సీఎండీగా ఎ.మాధవరావు బాధ్యతలు చేపట్టారు. 2026 వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. ఆయన 2020 మార్చిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బీడీఎల్లో చేరారు.
కె.అఖిల్
పొక్లెయిన్ ఆపరేటర్గా పనిచేసే 28 ఏళ్ల కె.అఖిల్ కేరళ సాహిత్య అకాడమీ వార్షిక అవార్డు - 2020 అందుకున్నారు. అఖిల్ రాసిన పొట్టి కథల పుస్తకం ‘నీలచడయాన్’కు ఈ అవార్డు ప్రకటించారు. ఉత్తర కేరళలోని సామాన్య ప్రజల జీవితాలను ఇందులోని కథలు ప్రతిబింబిస్తాయి.
మోక్షారాయ్
భారత సంతతికి చెందిన ఏడు సంవత్సరాల బ్రిటన్ బాలిక మోక్షారాయ్ ప్రతిష్టాత్మక బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డును గెలుచుకుంది.
ఫాంగ్నోన్ కొన్యాక్
నాగాలాండ్ నుంచి మొదటి మహిళా సభ్యురాలుగా ఫాంగ్నోన్ కొన్యాక్ రాజ్యసభలో అధ్యక్షత వహించారు. లింగ సమానత్వాన్ని తీసుకురావడానికి, రాజ్యసభ చైర్మన్ శ్రీ జగదీప్ ధన్ఖర్ వైస్-చైర్పర్సన్ల ప్యానెల్కు నలుగురు మహిళా సభ్యులను (మొత్తం సంఖ్యలో 50 శాతం) నామినేట్ చేశారు.
తెలంగాణ
తలసరి ఆదాయంలో టాప్
దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,08,732, స్థిర ధరల ప్రకారం రూ.1,64,657 ఉంది. తాజా ధరల ప్రకారం తెలంగాణ దక్షిణాదిలో ప్రథమ స్థానంలో నిలిచినా స్థిర ధరల కొలమానంలో మూడో స్థానంలో ఉంది.
ఎఫ్డీఐల్లో ఏడో స్థానం
గత మూడేళ్లలో దేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచి, 2.47 శాతం వాటా కలిగి ఉంది.
నేషనల్
స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియా-2023
జైపూర్లో జరిగిన జాతీయ స్థాయి అందాల పోటీల్లో ‘స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియా–2023’గా చంద్రగిరికి చెందిన 'సంజన సంసర్వాల్' మిస్ ఇండియా కిరీటం సొంతం చేసుకుంది. గ్రాండ్ ఫైనల్లో 47 మంది పాల్గొనగా సంజన మొదటి స్థానం దక్కించుకుంది.
అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు ఆమోదం
దేశ సరిహద్దులకు 100 కి.మీ.లోపు దూరంలో ఉన్న భూములను అటవీ సంరక్షణ చట్టాల పరిధి నుంచి మినహాయించడానికి, అటవీ భూముల్లో జంతు ప్రదర్శన శాలలు, సఫారీలు, ఎకో టూరిజం సదుపాయాలు కల్పించడానికి ఉద్దేశించిన బిల్లును లోక్సభ ఆమోదించింది.
భారత వృద్ధి 6.1శాతం
ఈ సంవత్సరం భారత వృద్ధి 6.1 శాతంగా నమోదు కావచ్చొని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. ఏప్రిల్లో అంచనా వేసిన దాని కంటే ఇది 0.2 శాతం ఎక్కువ. దేశీయంగా పెట్టుబడులు పుంజుకోవడమే దీనికి కారణమని ఐఎంఎఫ్ పేర్కొంది.
సైన్స్ అండ్ టెక్నాలజి
ఫాల్కన్-9తో ప్రమాదం
ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ప్రయోగించిన ఫాల్కన్-9 రాకెట్ వల్ల భూమి చుట్టూ ఉన్న వాతావరణ పొర అయనోస్పియర్కి రంధ్రం ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.