
తెలంగాణ జాబ్స్ స్పెషల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాల ఆధారంగా రాజ్య వ్యవస్థను సమాఖ్య, ఏకకేంద్ర ప్రభుత్వాలుగా వర్గీకరించవచ్చు. కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఉంటే సమాఖ్య వ్యవస్థ అంటాం. అధికారాలన్నీ ఒకే ప్రభుత్వంలో కేంద్రీకృతమై ఉంటే దానిని ఏకకేంద్ర ప్రభుత్వం ఉంటారు. మన దేశంలో కేవలం పాలనా సౌలభ్యం కోసమే సమాఖ్య విధానం అనుసరించాం. అధికారాల పంపిణీ జాబితాలను 7వ షెడ్యూల్లో పొందుపరిచారు. రాజ్యాంగం 11వ భాగం కేంద్ర–రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన సంబంధాలు, 12వ భాగం ఆర్థిక సంబంధాల గురించి చర్చిస్తుంది.
1967 లో జరిగిన నాలుగో సాధారణ ఎన్నికల తర్వాత అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీలు, రాజ్యాంగంలోని కేంద్రీకృత ధోరణిని ప్రశ్నించడం ఆరంభించాయి. రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కావాలని డిమాండ్ చేయడంతో సమస్య తీవ్రమైంది. పశ్చిమబెంగాల్లోని వామపక్ష ప్రభుత్వం, పంజాబ్లో అకాళీదల్ ప్రభుత్వం ఆనంద్పూర్ సాహెబ్ తీర్మానం లాంటివి అనేక సమస్యలను ముందుకు తీసుకొచ్చాయి. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు మెరుగుపరచడం కోసం తీసుకోవాల్సిన చర్యలు, సూచించాల్సిందిగా కోరుతూ ఇందిరాగాంధీ ప్రభుత్వం మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్, తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం రాజమన్నార్ కమిటీ, 1983లో ఇందిరాగాంధీ సర్కారియా కమిషన్ను నియమించింది. ఈ కమిషన్లు అనేక సూచనలు చేశాయి. 2002లో చేసిన రాజ్యాంగ సమీక్ష జాతీయ కమిషన్ కూడా కొన్ని ప్రత్యేక సూచనలు చేసింది. సర్కారియా కమిషన్ సూచనలు అమలు తీరు పరిశీలించడానికి 2007లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మదన్మోహన్ పూంచీ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిషన్ ఏర్పాటు చేసింది. ఇది 2010 మార్చిలో నివేదిక సమర్పించింది. ఈ అంశాలపై ఉదాహరణ ప్రశ్నలు.
ఇందిరాగాందీ కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై కోసం వేసిన కమిషన్? (3)
1) నరసింహన్ కమిషన్ 2) మెహతా కమిషన్
3) సర్కారియా కమిషన్ 4) పూంచీ కమిషన్
భారత రాజ్యాంగ సమాఖ్య లక్షణం? (2)
a) రెండు స్థాయిల్లో ప్రభుత్వాలు b) లిఖిత రాజ్యాంగం
c) అధికార విభజన d) స్వతంత్ర న్యాయ వ్యవస్థ
1) a,c,d 2) a,b,c,d 3) c, d 4) b,c,d
- కేంద్ర, రాష్ట్ర సంబంధాల గురించి రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో 11, 12 భాగాల్లో 245వ అధికరణ నుంచి 300A అధికరణ వరకు మూడు రకాలుగా సంబంధాలను పొందుపర్చారు. రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం లేకపోయినా సమాఖ్య నమూనాను కెనడా రాజ్యాంగం నుంచి స్వీకరించి అనుసరిస్తున్నారు.
కేంద్ర రాష్ట్ర సంబంధాలు మూడు రకాలు
1. కేంద్ర – రాష్ట్ర శాసన సంబంధాలు
2. కేంద్ర – రాష్ట్ర పరిపాలన సంబంధాలు
3. కేంద్ర– రాష్ట్ర ఆర్థిక సంబంధాలు
కేంద్ర – రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు 245 నుంచి 255 అధికరణ వరకు ఉన్నాయి.
246 అధికరణ ప్రకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలను మూడు జాబితాలుగా విభజించారు. అవి.. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా
కేంద్ర జాబితా: కేంద్ర జాబితాలో ప్రస్తుతం 98 అంశాలు ఉన్నాయి. దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, పౌరసత్వం, తపాలా, రైల్వేలు, బ్యాంకులు, నౌకాయానం, విమానయానం
రాష్ట్ర జాబితా: రాష్ట్ర జాబితాలో మొదట 66 అంశాలు ఉండగా ప్రస్తుతం 59 అంశాలు ఉన్నాయి. రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్ర శాసనసభ శాసనాలు రూపొందిస్తుంది.
ఉదా: పోలీస్, శాంతిభద్రతలు, వ్యవసాయం, నీటిపారుదల, గ్రంథాలయాలు, మార్కెట్లు
ఉమ్మడి జాబితా: ఉమ్మడి జాబితాను ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి స్వీకరించారు. ఉమ్మడి జాబితాను సంధ్యా సమయ మండలంగా వర్ణించింది ఎంవీ ఫైలీ. ఈ జాబితాలో మొదట 47 అంశాలు ఉండగా ప్రస్తుతం 52 అంశాలు ఉన్నాయి.
ఉదా: వివాహం, విడాకులు, అడవులు, వన్యమృగ సంరక్షణ, సాంకేతిక విద్య, విద్య, విద్యుత్, జనాభా నియంత్రణ, ఉమ్మడి జాబితాలో అంశాలపై పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు శాసనాలు రూపొందిస్తాయి. ఒకేసారి ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్రం– రాష్ట్రం శాసనం చేసినప్పుడు కేంద్ర శాసనం అమల్లో ఉంటుంది.
అవశిష్ట అధికారాలు
248వ అధికరణ అవశిష్ట అధికారాల గురించి తెలుపుతుంది. కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాల్లో లేని అంశాలు అవశిష్ట అంశాలుగా గుర్తించాలి. అవశిష్ట అంశాలపై శాసనం చేసే అధికారం పార్లమెంట్ కు ఉంటుంది. వీటిని కెనడా నుంచి స్వీకరించారు. ఉదాహరణకు మరో ప్రశ్న.
కింది వాటిలో కేంద్ర జాబితాలో లేని అంశం ఏది? (4)
1) బ్యాంకింగ్ 2) ఇన్స్యూ రెన్స్
3) ఆడిట్ 4) జనాభా నియంత్రణ
విద్య ఏ జాబితాలో అంశం? (3)
1) రాష్ట్ర జాబితా 2) కేంద్ర జాబితా
3) ఉమ్మడి జాబితా 4) అవశిష్ట అంశం
- పరిపాలన సంబంధాలను 256, 257, 258, 258A, 260, 261లు వివరిస్తాయి.
262వ అధికరణ: అంతర్రాష్ట్ర నదీ జల మండలి
263వ అధికరణ: అంతర్రాష్ట్ర మండలి
రాజ్యాంగంలోని 12వ భాగం 264 నుంచి 300A వరకు గల అధికరణలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను వివరించారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల విధింపునకు సంబంధించి కచ్చితమైన విభజన చేశారు. ఉదా: కేంద్ర పన్నులు: కార్పొరేషన్ పన్ను, ఆదాయంపై పన్ను, ఎక్సైజ్ సుంకంరాష్ట్ర పన్నులు: అమ్మకం పన్ను, భూమిశిస్తు. - వి.కొండల్ సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్