
బెంజెమాకు ‘గోల్డెన్ బాల్’
యూరోపియన్ అత్యుత్తమ ఫుట్బాల్ ప్లేయర్కు ప్రదానం చేసే ప్రతిష్టాత్మక పురస్కారం ‘గోల్డెన్ బాల్’ను ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు, రియల్ మాడ్రిడ్ క్లబ్ జట్టు సభ్యుడు కరీమ్ బెంజెమా సొంతం చేసుకున్నాడు. 2009 నుంచి మాడ్రిడ్ జట్టుకు ఆడుతున్న కరీమ్ 223 గోల్స్ సాధించాడు.
తొలి భారతీయ రెజ్లర్గా రికార్డ్
ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్షిప్ చరిత్రలో గ్రీకో రోమన్ విభాగంలో పతకం నెగ్గిన తొలి భారతీయ రెజ్లర్గా సాజన్ భన్వాల్ గుర్తింపు పొందాడు.
ముగిసిన ప్రపంచ జియోస్పేషియల్ సమ్మిట్
హైదరాబాద్లో నాలుగు రోజులుగా జరుగుతున్న ఐక్యరాజ్యసమితి ప్రపంచ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ సమ్మిట్ ముగిసింది. సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా అట్టడుగు ప్రజలకు, సామాన్యులకు ఉపయోగపడేలా ఉన్నప్పుడే ప్రయోజనం ఉంటుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
అర్బన్ వేస్ట్ వాటర్ సినారియో ఇన్ ఇండియా
దేశంలో పట్టణ ప్రాంతాల నుంచి వెలువడే మురుగు నీటిలో కేవలం 28శాతం మాత్రమే శుద్ధి అవుతోందని, మిగిలిన 72శాతం నదులు, సరస్సులు, భూగర్భంలోకి వెళుతోందని నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన 'అర్బన్ వేస్ట్ వాటర్ సినారియో ఇన్ ఇండియా' నివేదికలో పేర్కొంది.
ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ
ఢిల్లీ ప్రగతి మైదాన్లో ప్రారంభమైన ఇంటర్పోల్ 90వ జనరల్ అసెంబ్లీ సందర్భంగా స్మారక పోస్టల్ స్టాంపును, రూ. వంద నాణేన్ని ప్రధాని మోడీ విడుదల చేశారు. పాతికేళ్ల తర్వాత మన దేశం ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది.
కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా గిరిధర్ అరమణె
కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా 1988 ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి గిరిధర్ అరమణె నియమితులయ్యారు. ప్రస్తుతం కేంద్ర రహదారులు, రవాణా శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయన్ను రక్షణ శాఖకు బదిలీ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే
కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గేకు 7వేలకు పైగా ఓట్ల మెజారిటీతో శశిథరూర్ పై గెలుపొందారు.తాజా ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు ఆరుసార్లు ఎన్నికలు నిర్వహించారు.
రోజర్ బిన్నీ
బీసీసీఐ అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్, కర్ణాటకకు చెందిన రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా జై షాకు మరో అవకాశం దక్కింది. అశిష్ షేలార్ కొత్త కోశాధికారిగా, రాజీవ్ శుక్లా ఉపాధ్యక్షుడిగా, దేవ్జీత్ సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
షెహాన్ కరుణతిలక
ప్రతిష్టాత్మాక బుకర్ ప్రైజ్ 2022ను శ్రీలంక రచయిత షెహాన్ కరుణతిలక గెలుచుకున్నారు. ఆయన రెండవ రచన ‘ద సెవెన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మైదా’ పుస్తకానికి ఈ పురస్కారం దక్కింది. శ్రీలంకలో చోటు చేసుకున్న క్రూరమైన అంతర్యుద్ధం నేపథ్యం ఆధారంగా ఆ రచన సాగింది.
సీమా ముస్తఫా
ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలిగా ‘ద సిటిజన్’ ఎడిటర్ సీమా ముస్తఫా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ‘ద కారవాన్’ ఎడిటర్ అనంత్నాథ్, కోశాధికారిగా సకల్ మీడియా గ్రూప్ చీఫ్ ఎడిటర్ శ్రీరామ్ పవార్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ప్రీతి తనేజా
లండన్ వంతెనపై 2019లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో రాసిన ‘ఆఫ్టర్మాథ్’ నవలకు భారత సంతతి రచయిత్రి ప్రీతి తనేజా గోర్డాన్ బర్న్ పురస్కారానికి ఎంపికయ్యారు. దీని కింద ఆమెకు 5 వేల పౌండ్లు లభిస్తాయి. ప్రస్తుతం ఆమె న్యూక్యాజిల్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.
జనార్దన్ ప్రవాస భారతీయుడు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డు ఆఫ్ డైరెక్టర్ జనార్దన్ నిమ్మలపూడి (జానీ) 5895 మీటర్ల ఎత్తున్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి తానా లోగో ప్రదర్శించారు. కిలిమంజారో అధిరోహించేందుకు ఆయన రెండేళ్ల పాటు శిక్షణ తీసుకున్నారు.
అగ్ని ప్రైమ్ సక్సెస్
అగ్ని ప్రైమ్ న్యూ జనరేషన్ బాలిస్టిక్ మిస్సైల్ను ఒడిశా తీరంలో రక్షణశాఖ అధికారులు విజయవంతంగా పరీక్షించారు.ఈ పరీక్ష ద్వారా మిస్సైల్ సిస్టమ్ అక్యురసీ, రిలయబిలిటీ తేలిందని అధికారులు చెప్పారు.
బాలిస్టిక్ మిస్సైల్ టెస్ట్
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ మొదటిసారిగా ఒక బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది.
బ్రిటన్ ప్రధాని రాజీనామా
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. తానిచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయానని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకూ తాను ప్రధాని పదవిలో కొనసాగుతానని తెలిపారు.
హైదరాబాద్కు గ్రీన్ సిటీ అవార్డు
భాగ్యనగరం రెండు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డుతో పాటు లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్ అవార్డుకూ ఎంపికైంది. దక్షిణ కొరియాలోని జెజులో కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రకటించారు.
దలైలామాకు స్పెండ్లవ్ పురస్కారం
టిబెట్ ఆధ్యాత్మికవేత్త దలైలామాను అలైస్ అండ్ క్లిఫర్డ్ స్పెండ్లవ్ పురస్కారం వరించింది. సామాజిక న్యాయం, దౌత్యం, సహన విభాగాల్లో ఈ పురస్కారం ప్రకటించినట్లు దలైలామా కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఈ అవార్డు అందుకొన్నారు.
స్వీడన్ ప్రధానిగా ఉల్ఫ్ క్రిస్టెర్సన్
స్వీడన్ ప్రధానిగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఉల్ఫ్ క్రిస్టెర్సన్ను ఆ దేశ పార్లమెంట్ ఎన్నుకుంది. కేవలం మూడు ఓట్ల ఆధిక్యంతో ఆయన డెమోక్రాట్లపై విజయం సాధించారు. మూడు పార్టీల సంయుక్త భాగస్వామ్యంతో ప్రధాని పదవికి పోటీపడిన ఆయన సంపూర్ణ మెజారిటీని సాధించలేకపోయారు.