
నేషనల్
ఏడు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర
పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన ఏడు బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపింది. జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు, జన్ విశ్వాస్ (సవరణ) బిల్లు, ఐఐఎం (సవరణ) బిల్లు, జాతీయ దంత వైద్య కమిషన్ (సవరణ) బిల్లు, సముద్ర ప్రాంత ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు కూడా చట్ట రూపం దాల్చాయి.
వాణిజ్య లోటు రూ.1.7 లక్షల కోట్లు
దేశ ఎగుమతులు జులైలో 32.25 బిలియన్ డాలర్ల (రూ.2.64 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయి. దిగుమతులు 52.92 బి.డాలర్ల (రూ.4.34 లక్షల కోట్ల)కు తగ్గాయి. ఫలితంగా వాణిజ్య లోటు (ఎగుమతులు - దిగుమతుల బిల్లుల మధ్య వ్యత్యాసం) 25.43 బి.డాలర్ల నుంచి 20.67 బి.డాలర్లకు (రూ.1.7 లక్షల కోట్లు) పరిమితమైంది.
థార్ ఎడారిలో పురాతన డైనోసార్ శిలాజం
ఐఐటీ - రూర్కీ, భారత భూగర్భ సర్వే సంస్థ (జీఎస్ఐ) పరిశోధకులు రాజస్థాన్ జైసల్మేర్లోని థార్ ఎడారిలో 16.7 కోట్ల ఏళ్ల క్రితం నాటి డైనోసార్ శిలాజాన్ని కనుగొన్నారు.
గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
జులైలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్టానికి చేరింది. గత నెలలో ఇది 7.44 శాతానికి పెరిగింది.
‘పీఎం విశ్వకర్మ’కు ఆమోదం
ఐదేళ్లలో అమలు చేయనున్న ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ పథకంతో 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. అర్హులైన వారికి రూ.2 లక్షల రుణ సదుపాయం 5 శాతం వడ్డీ రేటుతో ఇవ్వనున్నారు.
వ్యక్తులు
వైభవ్ తనేజా
టెస్లా కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా నియమితులయ్యారు. సీఎఫ్ఓ జాచరీ కిర్కాన్ వైదొలగుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెస్లా పేర్కొంది.
శశిధర్ జగదీశన్
గత ఆర్థిక సంవత్సరానికి రూ.10.55 కోట్ల వేతనాన్ని అందుకోవడం ద్వారా, బ్యాంకుల సీఈవోల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓ శశిధర్ జగదీశన్ ప్రథమ స్థానంలో నిలిచారు. 2023 బ్యాంకుల వార్షిక నివేదిక ప్రకారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిప్యూటీ ఎండీ భరూచాకు రూ.10 కోట్లు లభించాయి.
పర్మీందర్ చోప్రా
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) మొదటి పూర్తిస్థాయి మహిళా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా పర్మీందర్ చోప్రా బాధ్యతలు చేపట్టారు. ఆగస్టు 14 నుంచి ఆమె నియామకం అమల్లోకి వచ్చింది. 2023 జూన్ 1 నుంచి సీఎండీగా అదనపు బాధ్యతలను ఆమె నిర్వర్తించారు.
ఆర్.దొరైస్వామి
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మేనేజింగ్ డైరెక్టరుగా ఆర్.దొరైస్వామిని ప్రభుత్వం నియమించింది.
నరేంద్ర మోడీ
ఎర్ర కోట నుంచి వరుసగా పదేళ్లు మువ్వన్నెల జెండాను ఎగురవేసిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా నరేంద్ర మోడీ నిలిచారు. ఆయన 90 నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లాడారు. సరికొత్త రికార్డు సృష్టించారు. 10 సార్లు మోదీ ప్రసంగించగా సగటు సమయం 82 నిమిషాలుగా ఉంది.
తెలంగాణ
క్రైమ్ ఓఎస్కు ఈ-రక్షా పురస్కారం
సైబరాబాద్ పోలీసులు రూపొందించిన ‘క్రైమ్ ఆపరేటింగ్ సిస్టమ్’కు ‘ఈ-రక్షా’ అవార్డు విభాగంలో ‘క్రైమ్ ఓఎస్’కు తొలిస్థానం దక్కినట్లు ఎన్సీఆర్బీ ప్రకటించి పురస్కారం అందించింది.
దేశీయ రివాల్వర్ ‘ప్రబల్’దేశీయంగా రూపొందించిన తొలి లాంగ్ రేంజ్ రివాల్వర్ ‘ప్రబల్’ ఆగస్టు 18న విడుదలైంది. ఈ రివాల్వర్తో 50 మీటర్ల దూరంలోని లక్ష్యాలను గురిపెట్టవచ్చు.
సైన్స్ అండ్ టెక్నాలిజీ
నేవీలోకి వింధ్యగిరి
భారత నౌకాదళ అమ్ములపొదిలోకి మరో అధునాతన స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ ‘వింధ్యగిరి’ చేరింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కోల్కతాలోని హుగ్లీ నది తీరంలో ఈ నౌకను అధికారికంగా భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టారు.
ఇంటర్ నేషనల్
పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వరుల్
పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా పష్తూన్ తెగకు చెందిన అన్వరుల్ హఖ్ కాకర్తో అధ్యక్షుడు అరిఫ్ అల్వి ప్రమాణం చేయించారు. అధ్యక్ష కార్యాలయంలో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి షెహబాజ్ షరీఫ్ సహా పలువురు నేతలు హాజరయ్యారు.
పొడవైన గడ్డంతో ‘గిన్నిస్’ విజేతగా మహిళ
అమెరికాకు చెందిన హనీకట్ అత్యంత పొడవైన గడ్డం (11.8 అంగుళాలు) కలిగిన మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్స్లో చోటు దక్కించుకుంది. గతంలో ఇదే దేశానికి చెందిన వివాన్ వీలర్ అనే మహిళ పేరిట ఉన్న రికార్డును (10.04 అంగుళాలు) తాజాగా ఎరిన్ హనీకట్ అధిగమించింది.
‘తూర్పు లద్దాఖ్’ పరిష్కారానికి అంగీకారం
తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంట రెండు దేశాల మధ్య మిగిలిపోయిన సమస్యలను పరిష్కరించుకుందామని భారత్, చైనా ఒక అంగీకారానికి వచ్చాయి. రెండు రోజుల పాటు జరిగిన 19వ విడత చర్చల అనంతరం ఇరు దేశాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.