
వెలుగు: ప్రపంచమంతా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అంటూ పరుగులు తీస్తుంటే.. మన నాయకుల్లో కొంత మందికి అసలు సోష ల్ మీడియా అంటేనే తెల్వదంట. ఇంకొందరు ఫేస్ బుక్ దగ్గరే ఆగిపోయారట. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో పోటీకి నిలబడ్డ ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఏడుగురు తమకు ఒక్క సోషల్ మీడియా అకౌంట్ కూడా లేదని అఫిడవిట్లో ప్రకటించారు. వీరి పేర్ల మీద ఫేస్బుక్,ట్విట్టర్లలో పదుల కొద్దీ అకౌంట్లు ఉండగా, ఇందులోకొన్ని వారి కనుసన్నల్లో నే నడుస్తున్నాయి. తమకు ఫేస్బుక్ తప్ప, ఇంకే అకౌంట్లూ లేవని మరో 15మంది తెలిపారు. ఉన్నవారిలో ఇన్స్టాగ్రామ్ వరకూ అప్ డేట్ అయింది ఏడుగురే. వారిలో నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కవిత, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిముందంజలో ఉన్నారు. కవితకు ఇన్స్టాగ్రామ్లో60 వేల మంది, రేవంత్ కు 37 వేల మంది ఫాలోవర్లున్నారు. ధర్మపురి అర్వింద్(బీజేపీ) 8,600 మందిఫాలోవర్లతో మూడో స్థానంలో ఉన్నారు. మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్న రామచంద్రరావు(బీజేపీ), మర్రిరాజశేఖర్రెడ్డి(టీఆర్ఎస్), సికింద్రాబాద్ బరిలో ఉన్న తలసాని సాయికిరణ్(టీఆర్ఎస్), చేవెళ్లలో పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి(టీఆర్ఎస్)కి మాత్రమే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి. ఖమ్మం టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు నామా నాగేశ్వరావు, రేణుకా చౌదరి,నల్గొండ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి(టీఆర్ఎస్)తమకు ఫేస్బుక్ కూడా లేదంటున్నారు. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ ఫేస్ బుక్ , ట్విట్టర్ వాడుతున్నట్టు చెప్పారు. ఖమ్మం బీజేపీ అభ్యర్థి వాసుదేవరావు లింక్డ్ ఇన్ వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు.