
రామచంద్రాపురం, వెలుగు: రాష్ట్రంలో అర్హులందరికీ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీల పరిధిలోని పలు వార్డులు, పటాన్చెరు మండలం పోచారంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. పలువురు లబ్ధిదారుల నుంచి నేరుగా అప్లికేషన్లను స్వీకరించారు. మహాలక్ష్మి, రూ. 500 కే గ్యాస్ సిలిండర్, చేయూత పెన్షన్లు, రైతు భరోసా, పేదలకు ఇళ్లు ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమవుతాయని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందన్నారు.
పాలనా దక్షత ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని తెలంగాణ సమాజానికి, అభివృద్ధికి కాంగ్రెస్ మాత్రమే దిక్సూచని వాఖ్యానించారు. ఆయా దరఖాస్తు కేంద్రాల వద్ద వికలాంగులు, వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏర్పాట్లపై మంత్రి అధికారులతో మాట్లాడారు. పోచారం గ్రామానికి బస్సు సౌకర్యం, గ్రామంలోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సర్పంచ్ జగన్ మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శరత్, మున్సిపల్ చైర్మన్లు పాండురంగా రెడ్డి, లలితా సోమిరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.