ప్రజాపాలన దినోత్సవం దేనికి సంకేతం.. పోరాటానికా?విలీనానికా?

ప్రజాపాలన దినోత్సవం దేనికి సంకేతం.. పోరాటానికా?విలీనానికా?
  • ప్రజాపాలన దినోత్సవం దేనికి సంకేతం: కూనంనేని
  • చరిత్రను వక్రీకరించొద్దు.. ధైర్యంగా నిజాలు రాయాలి
  • కమ్యూనిస్టుల త్యాగం, పోరాటాన్ని గుర్తించాలని డిమాండ్​
  • సీపీఐ ఆఫీసులో ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, వెలుగు: ప్రజాపాలన దినోత్సవం పేరుతో ఆనాటి పోరాటం ఉనికిలో లేకుండా పోయే ప్రమాదముందని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాపాలన దినోత్సవం దేనికి సంకేతమని, పోరాటానికా?  విలీనానికా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని సీపీఐ స్టేట్​ ఆఫీస్​లో మంగళవారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 76వ వార్షికోత్సవం, తెలంగాణ విలీనం దినోత్సవ వేడుకలను నిర్వహించారు. 

ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషాతో కలిసి  కూనంనేని జాతీయ జెండా, ఎర్ర జెండాను ఎగుర వేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమర వీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల సారథ్యంలో ప్రజలు ఆయుధాలు పట్టుకుని రైతాంగ సాయుధ పోరాటంలో భాగస్వాములు అయ్యారన్నారు. చరిత్రను వక్రీకరిస్తే కనుమరుగై పోదన్నారు. కమ్యూనిస్టు పార్టీని చూసి పాలక పార్టీలు భయపడుతున్నాయన్నారు. ఆ భయంతోనే విమోచన దినమని, సమైక్యతా దినమని, ప్రజాపాలన దినోత్సవమని రకరకాల పేర్లు పెట్టుకుంటున్నాయని మండిపడ్డారు.

  ధైర్యంగా చరిత్రను చరిత్రగా రాయాలని, అందులో కమ్యూనిస్టుల త్యాగాలు, పోరాటాలను పేర్కొన్నాలని, ఇతరుల త్యాగాలను గుర్తించాలని, వాటిని పాఠ్యాంశంలో చేర్చాలని డిమాండ్​ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ విలీన దినోత్సవం పేరుతోనే ఉత్సవాలను నిర్వహించాలన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా మూడోంతుల తెలంగాణ ప్రాంతం కమ్యూనిస్టుల ఆధీనంలోకి వచ్చిందని గుర్తు చేశారు.