
- రాష్ట్రవ్యాప్తంగా దాదాపు5,810 స్థానాలకు ఎలక్షన్
- మండలానికి కనీసం ఐదుఎంపీటీసీ స్థానాలు ఉండేలా కసరత్తు
- గతంలో 5,857 ఎంపీటీసీలు..ఈసారి తగ్గిన సంఖ్య
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాల లెక్క తేలింది. కొన్ని గ్రామాలు జీహెచ్ఎంసీ, ఇతర నగరపాలక సంస్థలు, పురపాలికల్లో విలీమయ్యాయి. ఈ గ్రామాల పరిధిలోని వార్డులు, ఓటర్లను వచ్చే లోకల్బాడీ ఎన్నికల నుంచి మినహాయించాలని ఇటీవల ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల వారీగా ఓటర్ లిస్ట్, పోలింగ్ కేంద్రాలు, బూత్లను తొలగించాలని, ఓటర్ జాబితా నుంచి మినహాయించాలని అధికారులకు సూచించింది.
మిగిలిన ఓటర్లతో అనుబంధం జాబితాను ఈ నెల 6వ తేదీలోపు ప్రచురించాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించడంతో అధికారులు కసరత్తు చేసి.. లేక్క తేల్చారు. విలీన పంచాయతీల్లోని ఎంపీటీసీలను మినహాయించగా.. రాష్ట్రవ్యాప్తంగా 5,810 ఎంపీ టీసీ స్థానాలు ఉన్నట్టు లెక్కతేలింది. గతంలో 5,857 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య కొంతమేరే తగ్గింది.
గతంలో రాష్ట్రంలో దాదాపు 22 మండలాల్లో కనీసం ఐదుగురు ఎంపీటీసీలు లేరు. దీంతో ఈ సారి ఎంపీటీసీల పునర్విభజనలో భాగంగా ఆ మండలాల్లో కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండేలా పీఆర్ అధికారులు జాబితా
రూపొందించారు. కాగా, రాష్ట్రంలో 32 జడ్పీ, 570 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.