కాంగ్రెస్​ రాగానే హింస, నేరాలు పెరిగినయ్ : హరీశ్​ రావు

కాంగ్రెస్​ రాగానే హింస, నేరాలు పెరిగినయ్ : హరీశ్​ రావు
  • ఏడాది క్రితం వరకు తెలంగాణ ప్రశాంతంగా ఉంది: హరీశ్​ రావు

హైదరాబాద్, వెలుగు: ఏడాది క్రితం వరకు శాంతియుతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే హింస, నేరాలు పెరుగుతున్నాయని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు ఆరోపించారు. కొల్లాపూర్​ నియోజకవర్గంలోని నార్యనాయక్​ తండాలో బీఆర్ఎస్​ నాయకులపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనమని శనివారం ఎక్స్​లో పేర్కొన్నారు. 

కాంగ్రెస్​ వస్తే మార్పు వస్తుందని అప్పట్లో రేవంత్​ చెప్పారని, ఇప్పుడు కాంగ్రెస్​ శ్రేణులను ఉసిగొల్పుతూ నిజంగానే మార్పు తెచ్చారన్నారు. ఎమర్జెన్సీ పాలనను కొల్లాపూర్​లో అమలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి జూపల్లి కృష్ణా రావు అనుచరుల దాడులు పెరుగుతున్నా.. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్​ పనిచేస్తుంటే.. కాంగ్రెస్​ నేతలకు జీర్ణం కావడం లేదన్నారు. ఇలాంటి దాడులకు భయపడబోమని తేల్చి చెప్పారు.