![పోలీసుల చేతిలో లేటెస్ట్ టెక్నాలజీ..క్రిమినల్స్ తప్పించుకోలేరు](https://static.v6velugu.com/uploads/2025/02/telangana-police-catching-criminals-faster-with-new-technology_2sgGQEzBxh.jpg)
- క్రిమినల్స్కు ‘టెక్’ చెక్
- రాష్ట్ర పోలీసుల చేతికి ఏఎంబీఐఎస్ టెక్నాలజీ
- వేలిముద్రలు, ఐరిస్, ఫేస్ ఫీచర్స్తో నేరగాళ్లను పట్టేస్తుంది
- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్తో న్యూరల్ నెట్వర్క్
- రష్యా తరువాత హైదరాబాద్లోనే వినియోగం
హైదరాబాద్, వెలుగు: నేరాలు చేసి తప్పించుకు తిరిగే క్రిమినల్స్ ఆటకట్టిస్తున్నారు రాష్ట్ర పోలీసులు. కొత్త టెక్నాలజీతో నేరస్థులను వేగంగా పట్టుకుంటున్నారు. అంతర్రాష్ట్ర ముఠాలను, సైబర్ నేరగాళ్లను ఆన్లైన్లో ట్రేస్ చేసి అరెస్ట్ చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఇప్పటికే నమోదైన కేసుల ఆధారంగా ఆయా రాష్ట్రాల పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర సీఐడీలో ‘ఆటోమెటెడ్ మల్టీ మోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్(ఏఎంబీఐఎస్)’అందుబాటులోకి వచ్చింది.
రాష్ట్రంలో 2017 నుంచి ‘‘ఆటోమేటిక్ ఫింగర్ ఫ్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్” పాపిలాన్ టెక్నాలజీ ద్వారా కేసులను ఛేదిస్తుండగా.. గతేడాది నుంచి ఏఎంబీఐఎస్ టెక్నాలజీ కేసుల దర్యాప్తులో కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ సిస్టమ్తో గతేడాది 507 కేసులను ట్రేస్ చేశారు.
వివరాలు తెలియని 71 డెడ్బాడీలను గుర్తించారు. ఇలా దేశంలో ఎక్కడ నేరం చేసినా నేరస్థులను గుర్తించే విధంగా క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్( సీసీటీఎన్ఎస్)తో అనుసంధానం చేశారు. నిందితుల ఆధార్, ఫింగర్ ప్రింట్తో ఆన్లైన్ సెర్చింగ్ చేస్తుంటారు.
వేలిముద్రలకు ఉన్న ప్రాధాన్యత ఇదే..
ఒకరికి ఉన్న వేలిముద్రలు ప్రపంచంలో మరొకరికి ఉండవు. ఇందులో కూడా నాలుగు రకాల వేలిముద్రలు కలిగిన వాళ్లే ఉంటారు. మనిషి పుట్టిన దగ్గర్నుంచి చనిపోయేంత వరకు ఫింగర్ ప్రింట్స్లో ఎలాంటి మార్పులుండవు.
ఇదే కాకుండా వేలిపై ఉన్న పొరలు చెరిగిపోయినా మళ్లీ 15 రోజుల్లోనే యథాతథ స్థితిలోకి వస్తాయి. అందుకోసమే ఎక్కువగా సంతకాల కంటే వేలి ముద్రలనే ప్రామాణికంగా తీసుకుంటారు. కోర్టు కేసుల్లో కూడా వేలిముద్రలు అందించే సాక్ష్యాలు మాత్రమే నిజాలుగా నిలబడతాయి. ఈ క్రమంలోనే ఎలాంటి కేసులోనైనా సరే పోలీసులు అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలు సేకరిస్తారు.
ఇలా నేరం జరిగిన ప్రాంతం (సీన్ ఆఫ్ అఫెన్స్)లో లభించిన వేలిముద్రల ఆధారంగా అనుమానితుల వేలిముద్రలను పోల్చిచూస్తుంటారు. ఫింగర్ ప్రింట్ స్లిప్స్, ఫొటోలను లైవ్ డిజిటల్ స్కానర్లతో రికార్డ్ చేస్తున్నారు. నేరం చేసిన వెంటనే తప్పించుకున్నా..కొన్నేండ్ల తరువాతనైనా ఫింగర్ ప్రింట్స్తో పట్టేస్తున్నారు.
ఇలాంటిదే న్యూరల్ నెట్వర్కింగ్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కలిపి ఏఎంబీఐఎస్ టెక్నాలజీ రూపొందింది. రష్యా తరువాత మన దేశంలో వినియోగించడంలో రాష్ట్ర పోలీసులు ముందున్నారు.
నేరస్థుల ఎత్తు, బరువు నిర్ధారణ
ఏఎంబీఐఎస్ టెక్నాలజీ ద్వారా నేరస్థుల వేలి ముద్రలు, ఐరిష్ స్కాన్, ఫేస్ ఫీచర్స్, పాద ముద్రలతో ఎత్తు, బరువును అంచనా వేస్తారు. వీటితో పాటు ఫోర్జరీ కేసుల్లో సంతకం, చేతిరాతను కూడా పరిశీలిస్తుంటారు. ఇందుకోసం సీన్ ఆఫ్ అఫెన్స్లో వేలిముద్రలతోపాటు ఇతర బయోమెట్రిక్ వివరాల సేకరణకు ఏఎంబీఐఎస్ ఎంతగానో ఉపయోగపడుతున్నది. ఈ విధానం పూర్తిగా ఏఐపై పనిచేస్తుంది. ఇది న్యూరల్ నెట్వర్క్ సిస్టమ్ ఆధారంగా ఫింగర్ ప్రింట్ ద్వారా నిందితులను గుర్తిస్తుంది. దేశవ్యాప్తంగా నేరస్థులకు సంబంధించిన డేటాను విశ్లేషించడం, సమాచార సేకరణలోనూ ఈ వ్యవస్థ మంచి ఫలితాలను ఇస్తున్నది. పోలీస్ డేటాబేస్ లో అందుబాటులో ఉన్న ఫేషియల్ రికగ్నేషన్ డేటాను సైతం అనుమానితుల ఫేషియల్ ఇమేజ్లతో పోల్చేందుకు న్యూరల్ నెట్వర్క్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. గతేడాది వరకు దేశంలో సేకరించిన 9.3లక్షల ఫింగర్ ప్రింట్స్ డేటా రాష్ట్ర పోలీసులు వద్ద అందుబాటులో ఉంది. దీంతో ఆయా నేరగాళ్లు ఎక్కడ దాక్కున్నా దొరికిపోయే అవకాశాలు ఉన్నాయి.