
హైదరాబాద్, వెలుగు: ఐపీఎల్ తరహాలో రాష్ట్ర క్రికెటర్ల కోసం తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్)ను జూన్లో నిర్వహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) కసరత్తులు చేస్తోంది. ఈ లీగ్కు ఆమోదం తెలపడంతో పాటు ప్రతిష్టాత్మక మొయినుద్దౌలా గోల్డ్ కప్ టోర్నీ తిరిగి ప్రారంభించేందుకు బీసీసీఐ ఆమోదం తెలిపిందని హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ముంబైలో శనివారం జరిగిన బీసీసీఐ ఎస్జీఎంలో బోర్డు జాయింట్ సెక్రటరీగా గోవా క్రికెట్ అసోసియేషన్కి చెందిన రోహన్ దేశాయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎస్జీఎంకు హెచ్సీఏ ప్రతినిధిగా హాజరైన జగన్.. రోహన్కు సపోర్ట్ చేశారు. అనంతరం బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, సెక్రటరీ దేవాజిత్ సైకియాతో జగన్, హెచ్సీఏ వైస్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్, కౌన్సిలర్ సునీల్ అగర్వాల్తో సమావేశయ్యారు. టీపీఎల్తో పాటు మొయినుద్దౌలా గోల్డ్ కప్ను తిరిగి ప్రారంభించేందుకు సహకారం కోరారు. ఐపీఎల్ తర్వాత జూన్లో టీపీఎల్ నిర్వహణకు బీసీసీఐ ఆమోదం తెలిపిందని జగన్ పేర్కొన్నారు.